KTR | హైదరాబాద్ : స్టార్టప్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రంలో యువతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత అనుకూలమైన వాతావరణ కల్పించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో ఫౌండర్స్ ల్యాబ్ సంస్థను కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికితీసి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఫౌండర్స్ ల్యాబ్ తోడ్పడుతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టీ హబ్, టీ వర్క్స్, అగ్రి హబ్, వీ హబ్ వంటి పలు వేదికలను ఏర్పాటు చేసి వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోందన్నారు. ఫౌండర్స్ ల్యాబ్ సంస్థ కాలేజీ స్థాయి నుంచే విద్యార్థులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే విధంగా వారికి శిక్షణ అందించడం ఒక మంచి పరిణామమన్నారు.
ఫౌండర్స్ ల్యాబ్ సంస్థ సీఈఓ శకుంతల కాసరగడ్డ మాట్లాడుతూ.. ఫార్మా, అగ్రికల్చర్, మేనేజ్మెంట్ రంగాలను ఇంజినీరింగ్ రంగాలతో అనుసంధానం చేస్తూ సమాజానికి అవసరమైన అనేక ఆవిష్కరణలు విద్యార్థుల ద్వారా వెలికితీసే అవకాశం ఉందన్నారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ సహకారంతో వారికి కావాల్సిన అన్ని అంశాల్లో సంస్థ పూర్తి సహకారం అందజేసి, వారిని అత్యుత్తమ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని సేవలను తమ సంస్థ అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్కుమార్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, పైలెట్ రోహిత్ రెడ్డి, సంస్థ డైరెక్టర్ సత్య ప్రసాద్ పెద్దపల్లి పాల్గొన్నారు.