హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ)/మెదక్: బంగారు తెలంగాణ సాధన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిలో తమవంతు భాగస్వామ్యం కొనసాగిస్తామని ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్పురి తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ వేదికలపై ప్రత్యేక ఆకర్షణగా, పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తున్నదని కొనియాడారు. రాష్ట్రంలో తమ పెట్టుబడులు కొనసాగిస్తామని, తెలంగాణతో తాము నిబద్ధతగల భాగస్వామిగా కొనసాగుతామని తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి హైదరాబాద్ కేంద్రంగా మారుతున్నదని పేర్కొన్నారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్లో ఐటీసీ సంస్థ రూ.450 కోట్లతో ఏర్పాటుచేసిన అధునాతన సమీకృత ఆహార శుద్ధి, లాజిస్టిక్స్ కేంద్రాన్ని సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సంజీవ్పురి మాట్లాడుతూ, తెలంగాణను అభివృద్ధివైపు నడిపించటంలో కేటీఆర్ చూపుతున్న డైనమిజం, ప్యాషన్ తమకు అదర్శంగా నిలిచాయని చెప్పారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధిస్తున్నదని, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి నమోదు చేస్తున్నదని ప్రశంసించారు.
తయారీ రంగానికి గ్లోబల్ హబ్
రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, పంచాయతీరాజ్ సంస్కరణలు, పాఠశాలల్లో మౌలిక వసతుల వృద్ధి వంటి కార్యక్రమాలతో తెలంగాణను ప్రభుత్వం మూలాల నుంచి బలోపేతం చేస్తున్నదని సంజీవ్పురి కొనియాడారు. హైదరాబాద్ను తయారీ రంగంలో గ్లోబల్ హబ్గా అభివృద్ధి చేస్తున్నదని ప్రశంసించారు. అతి తక్కువ సమయంలో ఈ యువ రాష్ట్రం ఎన్నో అద్భుతాలు సృష్టించిందని తెలిపారు. పెట్టుబడుల విషయంలో ప్రపంచంలోనే తెలంగాణ గ్లోబల్ డెస్టినేషన్గా ఎదిగిందని ప్రశంసించారు.
టీఎస్ ఐపాస్, టీహబ్, టాస్క్, టీవర్క్స్ కార్యక్రమాల ద్వారా రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోతున్నారని కొనియాడారు. 2020లోనే తెలంగాణ మేధో సంపత్తి రంగంలో గుర్తింపు తెచ్చుకొన్నదని గుర్తుచేశారు. టీహబ్ గురించి అమెరికాలోని కాలిఫోర్నియాలో తాను విన్నానని చెప్పారు. టీఎస్ బీపాస్, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ ఆఫ్ హైదరాబాద్, ఫార్మాసిటీ, రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ తదితర కార్యక్రమాలను తెలంగాణ విజయవంతంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు.
‘ఐటీసీ కొహినూర్ నుంచి మనోహరాబాద్లోని మా పరిశ్రమకు వస్తున్న సమయంలో రోడ్లను గమనించాను. ఇక్కడి రాష్ట్ర రహదారులు, మౌలిక సదుపాయాలు ఎంతో బాగున్నా యి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉన్నది. ఇటీవల దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చుకొన్నది. నాలుగో పారిశ్రామిక విప్లవానికి హైదరాబాద్ కేంద్రంగా మారుతున్నదని డబ్ల్యూఈఎఫ్ గుర్తించింది. ప్రపంచ వేదికపై ఇలాంటి గుర్తింపు లభించడమే తెలంగాణ అభివృద్ధికి నిదర్శనం’ అని తెలిపారు.
రేయాన్ పరిశ్రమ పునరుద్ధరణకు సహకరించండి
ములుగు జిల్లాలో గతంలో మూతపడిన ఏపీ రేయాన్ (బల్లార్పూర్ ఇండస్ట్రిస్ లిమిటెడ్) పరిశ్రమను పునరుద్ధరించాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీన్ని చేపట్టేందుకు ఐటీసీ సంస్థ ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అతిపెద్ద తయారీ హబ్ను ఏర్పాటు చేయాలని ఐటీసీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భౌగోళికంగా 8-9 రాష్ర్టాలకు మధ్యన ఉన్నందున ఇక్కడ తయారీ హబ్ను ఏర్పాటు చేయడంవల్ల ఆయా రాష్ర్టాలకు రవాణా సౌకర్యం ఎంతో తేలిగ్గా ఉంటుందని తెలిపారు.
తెలంగాణ సాధించిన విజయాలకు సంజీవ్పురి ప్రశంసలే నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం నియోజకవర్గమైన గజ్వేల్ పరిధిలో ఇంతపెద్ద పరిశ్రమ రావడం గర్వకారణమని అన్నారు. తూప్రాన్ పరిసర ప్రాంత గ్రామాల్లో సీఎస్ఆర్ కింద విద్య, వైద్యం అభివృద్ధికి సహకారం అందించాలని ఐటీసీ సంస్థకు విజ్ఞప్తి చేశారు. బింగో చిప్స్సహా వివిధ రకాల ఉత్పత్తుల ముడి సరుకు స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఇక్కడ పండుతున్న ఆలుగడ్డలకు నాణ్యత లేనందున చిప్స్ తయారీకి ఉపయోగపడటం లేదని కంపెనీ వర్గాలు చెప్తున్నాయని, వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలను సంప్రదించి నాణ్యమైన ఆలుగడ్డలు పండేలా చర్యలు తీసుకోవాలని కంపెనీ వర్గాలకు సూచించారు.
రైతుల ఆదాయం రెట్టింపునకు వాస్తవ రూపం
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఐదు రకాల విప్లవాలు సాధించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘నీటి పారుదల రంగంలో నాలుగేండ్ల్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాం. మిషన్ భగీరథలో భాగంగా కోటి ఇండ్లకు రక్షిత మంచినీటిని అందిస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ. 46 వేల చెరువులను పునరుద్ధరించి సాగునీటి రంగానికి సహకారం అందిస్తున్నాం. 10 ఎకరాల్లో ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాం.
గజ్వేల్లో 1400 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఐటీసీని కోరుతున్నా. రెండో హరిత విప్లవంలో భాగంగా 2014లో రాష్ట్రంలో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, నేడు అది మూడున్నర కోట్ల టన్నులకు చేరింది. నీలి విప్లవంలో భాగంగా చేపల పెంపకంలో, ఇన్లాండ్ ఫిషరీస్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ పేరుగాంచింది. శ్వేత విప్లవంలో భాగంగా డెయిరీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. గులాబీ విప్లవంలో భాగంగా మాంసం ఉత్పత్తుల శుద్ధి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం.
పసుపు విప్లవంలో భాగంగా వంటనూనెలను రాష్ట్రంలో ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకొంటున్నాం. వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వంట నూనెల పరిశ్రమలో ఐటీసీ కూడా పెట్టుబడులు పెట్టాలి’ అని కేటీఆర్ కోరారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి, జడ్పీ చైర్మన్ హేమలతా గౌడ్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు
ఎన్నో ఏండ్లుగా తెలంగాణలో తాము పరిశ్రమలు నడుపుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడుతామని సంజీవ్ పురి తెలిపారు. తమ పేపర్బోర్డు బిజినెస్కు తెలంగాణ కేంద్రంగా ఉన్నదని, రూ.2000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద పేపర్బోర్డు పరిశ్రమను భద్రాచలంలో నెలకొల్పినట్టు తెలిపారు. ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీనెస్ట్ పేపర్బోర్డు కూడా అని చెప్పారు. బొల్లారంలో మరో పేపర్ తయారీ కేంద్రం ఉన్నదని పేర్కొన్నారు. అగ్రి బిజినెస్లో భాగంగా వరి, జొన్న, తృణధాన్యాలు, మిర్చి, పసుపు వంటి పంటలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.
తెలంగాణ రైతులను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేస్తున్నామని హామీ ఇచ్చారు. 59 ఎకరాల్లో ఆరున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సమీకృత ఆహార శుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేశామని, రెండో దశ పనులు పూర్తయితే పది లక్షల ఎస్ఎఫ్టీకి పెరుగుతుందని వివరించారు. 83,500 ఎకరాల్లో వాటర్ స్టీవార్డ్షిప్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.