సిరిసిల్ల: బీఆర్ఎస్ పార్టీ కోసం నాడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్థలం ఇచ్చారని, అప్పటి ప్రభుత్వానికి నచ్చకపోవడంతో తమను ఖాళీ చేయించిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. సిరిసిల్లలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి చిహ్నమని, పార్టీ శాశ్వతంగా ఉండాలనే అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నేతలది మాత్రమే కాదని, ప్రతి బిఅర్ఎస్ కార్యకర్తదని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల సైన్యం ఉన్న పార్టీ అని, గులాబీ జెండా అంటే పేదల జెండా అని మంత్రి వ్యాఖ్యానించారు. కార్యకర్తల ఇంట్లో శుభకార్యాలు ఉంటే పార్టీ కార్యాలయాన్ని తక్కువ ఖర్చుతో ఇవ్వాలన్నారు. కార్యకర్తలు ఎప్పుడు సిరిసిల్లకు వచ్చినా బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో చాయ్ తాగి వెళ్లాలని మంత్రి సూచించారు. ప్రజావాణిలో ధరకాస్తులు ఇచ్చే వారు బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇచ్చినా తీసుకొని సమస్యలు పరిష్కరించాలన్నారు.
కార్యాలయంలో నాయకులు ప్రతి రోజు ప్రెస్ మీట్లు పెట్టాలని, అవతలి పార్టీ వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి తిడితే వెంటనే ప్రెస్మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వాలని మంత్రి సూచించారు. కాంగ్రెస్, బీజేపీ బాస్లు ఢిల్లీలో ఉంటారని,
మన బాస్ లు గల్లీలో ఉంటారని చెప్పారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి కాంగ్రెస్, బీజేపీ దుప్పటి కప్పుకున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్లకే ఓట్లు వస్తాయని, కేసీఆర్ను తిడితే రావని మంత్రి వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్ లాగా చూడాలని మంత్రి సూచించారు. కాంగ్రెస్, బీజేపీలను పొల్లుపొల్లుగా ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓటర్లను ఒప్పించి, మెప్పించి ఓట్లు అడగాలన్నారు. కమలాకర్ కరీంనగర్ భీముడని, అయనకు మనం చెప్పేది ఏమీ లేదని, కచ్చితంగా గెలుస్తాడని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఒక్క 45 రోజులు తమ కోసం పని చేయాలని, ఆ తర్వాత ఐదేళ్లు తాము మీ కోసం పని చేస్తామని కార్యకర్తలను కోరారు.