హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారి వివరాల జాబితాను ప్రత్యేక వెబ్సైట్లో పొందుపర్చాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పోలీసుశాఖను కోరారు. ఈ జాబితాల్లో నమోదైన దోషులకు ఎక్కడా ఉద్యోగావకాశాలు రాకుండా, ప్రభుత్వ పథకాలు వర్తించకుండా చేయాలని కోరారు. ప్రముఖ ఎన్జీవో సునీతాకృష్ణన్ నుంచి ఈ సలహా వచ్చిందని, హోంమంత్రి, డీజీపీ, పోలీసు అధికారులు దీన్ని సాధ్యమైనంత త్వరగా అమలుచేయాలని విజ్ఞప్తిచేశారు.
శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ’ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. విశ్రాంత డీఆర్డీవో నిపుణులు రామ్గణేశ్ స్థాపించిన ‘సైబర్-ఐ’ స్టార్టప్ ద్వారా సైబర్ నేరాలను అరికట్టేందుకు రూపొందించిన ‘క్రైమ్ ఆపరేటింగ్ సిస్టమ్'(క్రైమ్ ఓఎస్), సైబర్ నేరాల దర్యాప్తు, నియంత్రణకు సంబంధించి రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్స్ (ఎస్వోపీ) వెబ్సైట్నూ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళల భద్రతలో డ్రోన్ టెక్నాలజీని వినియోగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ‘ఫోన్లో బటన్ నొక్కితే, దగ్గరలోని పోలీస్స్టేషన్ నుంచి డ్రోన్ బాధిత మహిళ లొకేషన్ గుర్తించి క్షణాల్లో అక్కడికి వచ్చి అక్కడి పరిణామాలను రికార్డు చేస్తుంది. సైరన్ మోగించడంతో నిందితులు ఘోరానికి పాల్పడకుండా నిలువరించే వీలుంటుంది’ అని వివరించారు.
సైబర్ నేరాలపై అవగాహన పెరగాలి
దేశ జనాభా 140 కోట్ల కన్నా ఫోన్లే అధికంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. సైబర్క్రైం టోల్ఫ్రీ నంబరు 1930పై ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. సైబర్క్రైం రాజకీయాల్లోనూ చొరబడి ఓటర్లను ప్రభావితం చేస్తున్నదని చెప్పారు. వ్యవస్థల బలోపేతంతోనే ఉత్తమ ఫలితాలు వస్తాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్రెడ్డి, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీ ప్రవీణ్కుమార్, సయెంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డీవీఆర్ మోహన్రెడ్డి, మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ అభిషేక్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.