హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఎంబీబీఎస్ సీటు పొందిన ఓ నిరుపేద విద్యార్థినికి కేటీఆర్ అండగా నిలిచారు. మెడిసిన్లో ప్రవేశం పొందేందుకు కావాల్సిన ఫీజును ఆమెకు కేటీఆర్ అందజేశారు.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని రాజాపూర్ గ్రామానికి చెందిన అవునూరి అఖిల.. నీట్లో మంచి ర్యాంకు సాధించింది. స్టేట్ లెవల్లో నాలుగు వేల ర్యాంకు సాధించిన అఖిల.. సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో సీటు పొందింది. అయితే మెడికల్ కాలేజీలో చేరేందుకు కావాల్సిన ప్రవేశ రుసుం తన వద్ద లేకపోవడంతో అఖిల ఆందోళనకు గురైంది.
విషయం తెలుసుకున్న కేటీఆర్.. ఆమెను ఇవాళ ప్రగతి భవన్కు పిలిపించారు. ఈ సందర్భంగా రూ. 5 లక్షల నగదును కేటీఆర్ అఖిలకు అందజేశారు. బాగా చదువుకోవాలని అఖిలకు మంత్రి సూచించారు. తనకు ఆర్థికంగా అండగా నిలిచిన మంత్రి కేటీఆర్కు అఖిల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అఖిల సెంటనరీ కాలనీలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో నాలుగో తరగతి వరకు చదివింది. ఐదు నుంచి 10వ తరగతి వరకు నర్మాలలోని గురుకుల పాఠశాలలో, ఇంటర్ కరీంనగర్లోని అలుగునూరు సీఈవో కాలేజీలో చదివింది.