Minister KTR | ఇప్పటిదాకా ఒక ఎత్తు.. ఇప్పుడు ఒకెత్తు అని.. యువత ప్రాణం పెట్టి చదివి తల్లిదండ్రులు, నమ్ముకున్న ఆత్మీయుల స్వప్నాన్ని సాకారం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న తెలంగాణ యువతకు ఆదివారం మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖరాశారు. ‘మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు. సంఘర్షణకు ప్రతిరూపం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్ని అందిపుచ్చుకుంది.
వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్ మోడల్గా నిలిచింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ ఇవాళ దేశంలో నవ శకానికి నాంది పలికింది. ఎన్నో ఆంక్షల నడుమ స్వరాష్ట్రంలో స్వపరిపాలనను మొదలుపెట్టి తొమ్మిది ఏండ్ల వ్యవధిలో సుమారు రెండు లక్షల 25వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా దేశ చరిత్రను సరికొత్తగా లిఖించబోతుందని చెప్పడానికి నాకు సంతోషంగా ఉంది’ అన్నారు.
‘ఉద్యమకాలంలో, అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీకి అనుగుణంగా 1లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను మొదటిసారి అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ నాయకత్వంలో విజయవంతంగా పూర్తి చేశాం. ప్రజల ఆశీస్సులతో మరోసారి అధికారంలోకి వచ్చాక, 90వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత నిబద్ధతతో వేగంగా చేపట్టాం. ఇప్పటికే సుమారు 32వేల పైచీలుకు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చాం. గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అతి త్వరలో విడుదల చేయబోతున్నాం. మొత్తంగా రెండు లక్షల 25వేల పైచీలుకు ప్రభుత్వ ఉద్యోగాలను అతితక్కువ సమయంలో భర్తీ చేసి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవబోతుంది’ అని పేర్కొన్నారు.
‘ఉద్యోగాల భర్తీలో స్థానికులకే అధిక ప్రాధాన్యం దక్కాలన్న ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేశారు. అడ్డంకిగా వున్న రాష్ట్రపతి ఉత్తర్వుల సవరించడంతో ఆఫీస్ సబార్డినేట్ నుంచి ఆర్డీవో వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కుతున్నాయి. సీఎం కేసీఆర్ తెచ్చిన కొత్త జోనల్ వ్యవస్థతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఫలించింది. దీంతో పాటు విద్యార్థులు, యువకుల కోరిక మేరకు కేసీఆర్ నేతృత్వంలోని మా ప్రభుత్వం వమోపరిమితిని సడలించింది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పాల్గొనేందుకు మరింత మందికి అవకాశం దక్కింది.
నిరుద్యోగ యువత కోసం ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే.. ఏళ్ల తరబడి ప్రభుత్వ వ్యవస్థతో కలిసి పని చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులను క్రమబద్ధీకరించాం. త్వరలోనే మరో 10వేల మంది ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించనున్నట్లు తెలిపేందుకు సంతోషిస్తున్నాం. ఉద్యోగ ప్రకటనల జారీతో పాటు వేగంగా వాటిని భర్తీ చేసేందుకు గతంలో లేని భిన్నమైన నియామక ప్రక్రియను మా ప్రభుత్వం అమలుచేస్తున్నది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో మాత్రమే కాకుండా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, గురుకుల విద్యా సంస్థలతో ప్రత్యేక బోర్డుల ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వికేంద్రీకరించాం. ఫలితంగా సంవత్సరాల పాటు సాగే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సమూలంగా మారి నియామకాలు వేగంగా జరుగుతున్నాయి’ అని వెల్లడించారు.
‘తెలంగాణ ఏర్పడక ముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలు భర్తీ చేసిన ఉద్యోగాల నియామక ప్రక్రియపై సైతం ఎన్నో ఆరోపణలు, వివాదాలు నడిచాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఉద్యోగాన్ని అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని గర్వంగా చెప్పగలను. ఎలాంటి వివక్షకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో గ్రూపు-1 ఉద్యోగాల్లోనూ ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలికాం. అందుకే ఇప్పటిదాకా మా ప్రభుత్వం నింపిన ఉద్యోగాల భర్తీలో పారదర్శకత అంశంపై ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు.
అందుకే గతానికి భిన్నంగా ఇప్పటిదాకా ఈ అంశంపై ఒక్క వివాదం నెలకొనలేదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే గాక, ప్రైవేట్ రంగంలోనూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మా ప్రభుత్వం మెరుగుపరిచింది. ఇప్పటిదాకా సుమారు 17 లక్షలమందికిపైగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించిన ఘనత తెలంగాణాదే. ఇవేకాదు అద్భుతమైన ఆవిష్కరణల ఆలోచనలతో ఉన్న ఔత్సాహిక యువత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా స్టార్టప్ ఈకో సిస్టంను తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వినూత్నంగా ఆలోచించే యువతకు అండగా ఉండేందుకు టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్, టీఎస్ఐసీ వంటి వేదికలను ఏర్పాటు చేసింది’ అని వెల్లడించారు.
‘ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత స్థాయిలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువత కోసం కోచింగ్ సెంటర్లతో పాటు ఇతర వసతులను ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల తరఫున నిరుద్యోగులకు శిక్షణా తరగతుల నిర్వహణ సైతం ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్నది. నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడే లైబ్రరీల బలోపేతానికి సైతం కొన్ని సంవత్సరాలుగా మా ప్రభుత్వం చేస్తున్న కృషి ఇవాళ ఫలించింది. నిరుద్యోగ యువత ఈ సౌకర్యాలను ఉపయోగించుకోండి’ అని కేటీఆర్ కోరారు.
‘ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగపర్వం నడుస్తున్నది. సీఎం ఆశయానికి అనుగుణంగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ యువతకు నేనిచ్చే సలహా ఒక్కటే. పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోకండి. అవకాశవాద, అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా లక్ష్యం మీదనే గురి పెట్టండి. సానుకూల దృక్పథంతో సాధన చేసి, స్వప్నాన్ని సాకారం చేసుకోండి. కాలం తిరిగి రాదు. అవకాశాలను అందిపుచ్చుకోండి! ఏకాగ్రతతో అభ్యసించండి. లక్ష్యాన్ని చేరుకోండి! దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు అత్యధిక జీతాలను చెల్లిస్తున్నది.
ఆ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఆత్మవిశ్వాసం, పట్టుదల, ప్రణాళికతో చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించండి! ఉజ్వలమైన భవిష్యత్ను సొంతం చేసుకోండి. ఇప్పటిదాకా ఒక ఎత్తు. ఇప్పుడు ఒకెత్తు. ప్రాణం పెట్టి చదవండి. మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని నమ్మకున్న ఆత్మీయుల స్వప్నాలను నిజం చేయండి. తెలంగాణ యువతకు ఆకాశమే హద్దని చాటండి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ యువతకు అల్ది బెస్ట్ చెప్పడంతో పాటు ప్రయత్నాలు సఫలం కావాలని ఓ సోదరుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.