హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్ 21వ సదస్సులో ఫైర్చాట్లో మాట్లాడేందుకు మంత్రి కే తారకరామారావుకు ఆహ్వానం అందింది. ‘ఇండియా రైజింగ్-బిజినెస్, ఎకానమీ, కల్చర్’ థీమ్పై మాట్లాడాలని వర్సిటీ ఆయనను ఆహ్వానించింది. ‘తెలంగాణ సాధించిన అభివృద్ధిలో మీ ప్రభావవంతమైన నాయకత్వం, తెలంగాణను పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలబెట్టడం మాకు గొప్ప ప్రేరణగా నిలస్తున్నది’ అని ఆహ్వానం లో పేర్కొన్నది. హార్వర్డ్ వర్సిటీ నిర్వహించే ఇండియా కాన్ఫరెన్స్ అమెరికా విద్యార్థులు నిర్వహించే అతిపెద్ద కార్యక్రమాల్లో ఒకటి. ఇందులో విద్యార్థులు, వ్యాపార ప్రముఖులు, విధాన నిపుణులు సహా 1,000 మంది ప్రవాస భారతీయులు పాల్గొంటారు.
గతంలో అజీమ్ ప్రేమ్జీ, అమర్త్యసేన్, అనామికాఖన్నా సహా పలువురు మంత్రులు, వ్యాపార ప్రముఖులు, విద్యావేత్తలు, సాంస్కృతిక దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హార్వర్డ్ వర్సిటీ ఆహ్వానంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రగతిశీల విధానాలను చాటిచెప్పేందుకు, వివిధ రంగాల్లో రాష్ట్రం అందిస్తున్న అవకాశాలను ప్రపంచానికి తెలిపేందుకు ఈ సదస్సు గొప్ప వేదిక కానున్నదని పేర్కొన్నారు.