వరంగల్, జనవరి 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ హుజూరాబాద్: కమలాపూర్లో అభివృద్ధి జాతర జరిగింది. రూ.49.25 కోట్లతో పూర్తి చేసిన పనులను మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్లో పర్యటించారు. రూ.39 కోట్లతో నిర్మించిన మహాత్మా జ్యోతిబాపూలే బాలుర, బాలికల పాఠశాలలు, రూ.5 కోట్లతో నిర్మాణం పూర్తైన ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కేజీబీవీతోపాటు రూ.68.80 లక్షలతో నిర్మించిన పలు కమ్యూనిటీ భవనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
రూ.5.02 కోట్లతో నిర్మించతలపెట్టిన బస్ స్టేషన్, ముదిరాజ్ ఆలయం, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, గౌడ కమ్యూనిటీ హాల్, అయ్యప్పస్వామి ఆలయం, పద్మశాలి ఆల యం, పద్మశాలి కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్, జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్ల పనులకు శంకుస్థాపన చేశారు. మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో తరగతులను, గ్రంథాలయా న్ని పరిశీలించారు. పాఠశాలలోని డిజిటల్ క్లాసుల నిర్వహణ తీరును వీక్షించారు. అనంతరం కరీంనగర్ జిల్లా జమ్మికుంట బహిరంగ సభలో జమ్మికుంటకు రూ.120 కోట్లను మంజూరు చేస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి విజ్ఞప్తి మేరకు మహిళల రుణాల కోసం రూ.100 కోట్లు, క్రీడామైదానాల అభివృద్ధికి మరో రూ.20 కోట్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.