Minister KTR | సింగరేణి గనులు ఎందుకివ్వరో కేంద్రాన్ని నిలదీయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ చురకలంటించారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చల్లో సింగరేణిపై ఈటల చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘సింగరేణికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నాలుగైదు మైన్స్ ప్రైవేటు వ్యక్తులకు కాకుండా సింగరేణితో మైనింగ్ చేయించాలి ఈటల రాజేందర్ అన్నారు. ఆయన బీజేపీ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీ
కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది. ఆయన మాట్లాడే ప్రతీమాట సంయమనం, ఆలోచించి.. ఒకటి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం విధానం ఏంది? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? బొగ్గు గనుల విషయంలో ఏం చేస్తుంది ? ప్రైవేటు వ్యక్తుల విషయంలో ఏం చేస్తుంది? దిగుమతి బొగ్గు విషయంలో ఏం చేస్తుందో అవగాహన ఉందని అనుకుంటున్నా’ అన్నారు.
‘ప్రధాని హైదరాబాద్కు వచ్చే ముందు యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అభ్యర్థిగా ఇక్కడకు వస్తే శాసనసభ సభ్యుల సమావేశం పెట్టి సీఎం కేసీఆర్ సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం రాష్ట్రాలు, డిస్కంలకు ఉత్తరాలు రాసి దేశీయ బొగ్గును కొనవద్దని చెప్పింది. 25శాతం ఖర్చయితే మాత్రం కూడా దాన్ని పక్కనబెట్టి విదేశాల నుంచి ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాలని, నాలుగు రెట్లు విలువైన బొగ్గును దిగుమతి చేసుకోవాలని ఎవరి కోసం ? ఎవరి ప్రయోజనం కోసం చేసింది చెప్పాలి. ప్రధాని ఆస్ట్రేలియాకు పోగానే ఆయన దోస్తుకు పెద్ద బొగ్గు గని రెండునెలల్లోనే వస్తుంది. ఇండోనేషియాకు ప్రధాని పోగానే.. నెల రోజుల్లోనే మళ్లీ దోస్తుపోగానే బొగ్గు గనులు వస్తయ్. ఇవాళ దేశంలో ఏం జరుగుతుందో వారి మనసుకు కూడా తెలుసు. ఒకరి కోసం పని చేసే ప్రభుత్వం ఇక్కడ లేదు. బొగ్గు గనుల కోసం ఆవేదన చెబుతున్నారు. కేంద్రం
ఆధీనంలోని కోల్ ఇండియా కంటే సింగరేణి మెరుగైన ఫలితాలు సాధిస్తున్న మాట వాస్తవం కాదా?.. ‘సింగరేణి ఆధ్వర్యంలో పని చేస్తున్న జెన్కో, బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు 91.6 శాతం పీఎల్ఎఫ్తో భారతదేశంలో ప్రైవేటు విద్యుత్ కేంద్రాలు, కోల్ ఇండియా సంస్థల కంటే అత్యధిక పీఎల్ఎఫ్ సాధిస్తూ వరుసగా ఆరుసార్లు అవార్డు సాధించడం వాస్తం కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘ఇవాళ కొంత మంది వారి ప్రభుత్వాలు పల్లకీ మోస్తుండవచ్చు, పెద్దవాళ్లను చేస్తుండవచ్చు. ప్రపంచంలో ఒక వ్యక్తి కుబేరుడైన దేశమంతా బాగుపడ్డది అనుకోవచ్చు, కానీ మేమం అట్ల అనుకుంటలేం. ఈటల హృదయానికే తెలుసు ఏం జరుగుతుందో దేశంలో.. ఎవరి వల్ల.. ఎవరి ఒత్తిడితో అవసరం లేకుపోయినా బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్నది. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఆ పార్టీ విధానం, ఆ పార్టీ విధానంలో లోపాలు, ఎవరి కోసం పని చేస్తుందో ఆలోచించి సంయమనం మాట్లాడాలి. ప్రైవేటీకరణ చేసే ఆలోచన మాకు లేదు.. కేంద్రమంత్రిని అడిగిన ఆయన చెప్పండి.. ప్రధాని స్వయంగా చెప్పారని ఈటల రాజేందర్ చెబుతున్నారు. మరి ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తుక్కుకింద అమ్ముతున్నది ఎవరు కేంద్ర ప్రభుత్వం కాదా?.. ఏ కారణంతో అమ్మాల్సి వస్తుంది విశాఖ ఉక్కు. మొదట గనులు అలాట్ చేయకుండా మొదట కట్ చేస్తారు. ‘మొదట ఆక్సిజన్ కట్ చేస్తరు. కట్ చేసినంక ఆఖరికి పేషెంట్ సిక్ అయ్యాడని అమ్మేస్తరు’.. ఇదిగూడ ఇదే కథ’ అంటూ విమర్శించారు.
‘విశాఖ ఉక్కును తుక్కుకింద అమ్మే క్రమంలో ప్రభుత్వ విధానం అనుసరించిన విధానం.. గనులు ఇవ్వకుండా నష్టాల్లో పడిందని, దివాళా తీసిందని ఓ బోర్డు తగిలించి.. ఓ కుక్కను చంపేముందు పిచ్చికుక్క అని ముద్రేసినట్లు అదే వ్యూహంతో సింగరేణి విషయంలో కేంద్రం అవలంభిస్తుంది. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు గనులు నామినేషన్ బేసిస్ ఇస్తరు.. తెలంగాణ సింగరేణికి ఎందుకు ఇవ్వరు? మీకింత చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రాన్ని నిలదీసి అడగండి. గుజరాత్కు ఎందుకు ఇస్తున్నరు? తెలంగాణకు ఎందుకు ఇవ్వరని అడగండి. అలాగే విశాఖ ఉక్కును ఎందుకు అమ్ముతున్నరో అడండి.. గనులు ఎందుకివ్వకుండా నిర్వీర్యం చేశారని అడండి. ఇక్కడ ప్రేమకురిపిస్తూ.. కేంద్రంలో చేతల్లో ఇంకోలా చేస్తే మా పార్టీని, మీ నాయకత్వాని తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించరు.. అంగీకరించరు’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.