హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలోనూ ఎలక్ట్రిక్ వాహనరంగంలో రాష్ట్రం రూ.5,600 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. వీటివల్ల 8,300 మందికి ప్రత్యక్షంగా, ఇంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. జహీరాబాద్ క్లస్టర్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఒక కంపెనీ ముందుకొచ్చిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చందనపల్లి, మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో రెండుచోట్ల క్లస్టర్లు ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు. శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ నవీన్కుమార్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. పర్యావరణహితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకొంటున్నదని వివరించారు. రాష్ట్రంలో 23%గా ఉన్న పచ్చదనం హరితహారం కార్యక్రమం వల్ల 28 శాతానికి పెరిగినట్టు కేంద్రం వెల్లడించిందని పేర్కొన్నారు. వాహన కాలుష్యాన్ని తగ్గించే ప్రక్రియలో భాగంగా గతేడాది అక్టోబర్లో ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ స్టోరేజీ పాయింట్ విధానాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్, వరంగల్ పట్టణాల్లో 98 ప్రాంతాల్లో 119 చోట్ల విద్యుత్తు చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామని, త్వరలో మరో 500 పైగా పాయింట్లు విస్తరిస్తామని చెప్పారు. ఇప్పటికే ఆర్టీసీలో 40 బస్సులను కొనుగోలు చేసి, హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు నడుపుతున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. త్వరలో 500 మంది మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలను అందజేస్తామని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహన తయారీదారులతోపాటు వినియోగదారులకూ ప్రోత్సహకాలు అందజేస్తున్నామని వివరించారు. పరిశోధన, అభివృద్ధి, నవీకరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ఎస్జీఎస్టీ వాపస్, విద్యుత్తు, వడ్డీ, రవాణా తదితర అంశాల్లో రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు రహదారి పన్ను, వాహన రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఇస్తున్నట్టు వివరించారు.
హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో 23%గా ఉన్న పచ్చదనం 28%కి పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది.
–మంత్రి కేటీఆర్