హనుమకొండ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. కేటాయింపుల్లో గుండు సున్నా చూపించిందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏం చేయని ఈ మోదీ మనకెందుకు.. ఈ బీజేపీ మనకెందుకు అని కేటీఆర్ ప్రశ్నించారు. హనుమకొండలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మోదీ పైసలతోనే ఈ ప్రభుత్వం నడుస్తుందని ఓ చిల్లరగాడు మాట్లాడుతుండని కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాసుకో రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా.. తప్పు అయితే నా మంత్రి పదవిని తీసి ఎడమకాలి చెప్పులా పడేస్తా. ఈ ఏడేండ్లలో తెలంగాణ ప్రజలు తమ చెమట, రక్తం ధారపోసి పన్నుల రూపంలో కేంద్రానికి రూ. 3 లక్షల 65 వేల 797 కోట్లు ఇచ్చారు. కేంద్రం నుంచి వచ్చింది మాత్రం.. రూ. లక్షా 68 వేల 647 కోట్లే. మన పైసలను యోగి వద్దకు వెళ్లాయి. తెలంగాణ పైసలను బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. నేను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా. నేను చెప్పిన లెక్క తప్పయితే మంత్రి పదవిని వదిలిపెట్టి సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతా. నేను చెప్పింది తప్పని దమ్ముంటే బీజేపీ నాయకులు రుజువు చేయాలని సవాల్ చేస్తున్నాను. ఎవడి సొమ్ముతో ఎవడు కులుకుతున్నాడు? కేటీఆర్ అని ప్రశ్నించారు.