కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గ మేలు కోసమే ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పట్టుబట్టి మరి సీఎంను ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఒప్పించారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహరంగసభలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఆగస్టు 21న సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. 114 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. వాటన్నింటిలో ఒక్క కామారెడ్డి నియోజకవర్గంపై మాత్రం ప్రజలు ప్రత్యేకమైన ఆసక్తి కనబర్చారు. ఎందుకంటే కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలో దిగనున్నట్టు తెలిపారు. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి కారణం ఎమ్మెల్యే గంప గోవర్ధన్. గంప గోవర్ధన్ కోరిక మేరకు సీఎం కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ‘అన్నా మీ ఆశీర్వాదంతో నేను నియోజవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాను. ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పించాను. ఇక నాకు ఈ ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదు. నా నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందాలి. అది జరగాలంటే మీరు కామారెడ్డి నుంచి బరిలో దిగాలె’ అని సీఎంను గంప గోవర్ధన్ కోరారు. సీఎం వద్దన్నా ఆయన వినిపించుకోలేదు. మళ్లీమళ్లీ వెంటపడ్డారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం అని ఒక్కసారి ముద్రపడితే ఇక కామారెడ్డి రూపు రేఖలే మారుతయన్నా అని బతిమాలారు. దాంతో సీఎం కామారెడ్డిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు’ అని చెప్పారు.
నవంబర్ 9న కామారెడ్డిలో సీఎం నామినేషన్: కేటీఆర్
‘నవంబర్ 9న సీఎం కేసీఆర్ కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. కాబట్టి 9వ తేదీనాడు కామారెడ్డి మొత్తం కదిలి రావాలి. కామారెడ్డి సత్తా ఏందో ఇక్కడ పోటీ చేస్తానంటున్న రేవంత్ రెడ్డికి చూపించాలి. తెగ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడగొట్టినట్టు.. రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కేసీఆర్ మీద పోటీ చేస్త అని వస్తున్నడు. ఎవరొచ్చినా ఏం చేసినా గులాబీ జెండాను గెలిపించడం కామారెడ్డి ప్రజలకు కొత్త కాదు. అట్లాంటి కామారెడ్డికి వచ్చి నేనోదో చేస్త అని రేవంత్ రెడ్డి అంటున్నడు. నాకు కామారెడ్డి అన్నలు, తమ్ముళ్ల, అక్కాచెల్లెళ్ల మీద సంపూర్ణ నమ్మకం ఉన్నది’ అని మంత్రి తెలిపారు.