హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు సీబీఐకి అప్పగిస్తే మంత్రి కిషన్ రెడ్డి సంబురాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. దొంగల ముసుగులు తొలగిపోయాయి అని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ కలుగులో దాక్కున్న ఎలుకలు బయటకు వచ్చాయి. స్కామ్లోని స్వామీజిలతో సంబంధం లేదంటూ ఇప్పుడు సంబురాలు చేసుకుంటున్నారు. మాకు సంబంధం లేదని భుజాలు తముకున్నవారే దొంగలను భుజాలపై మోస్తున్నారు. కుట్ర కేసు తమ జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకే కిషన్ రెడ్డికి ఇంత సంబురమా? అని కేటీఆర్ అడిగారు.
ఒకప్పుడు సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. ఇప్పుడేమో సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్గా మారిందని ధ్వజమెత్తారు. దొరికిన దొంగలపై నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ టెస్టులకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలపై, బీజేపీపై ప్రజాక్షేత్రంలో ఎప్పుడో విచారణ ప్రారంభమైందన్నారు. అసమర్థ పాలనతో ప్రజాక్షేత్రంలో బీజేపీ ఫెయిలైంది. కేసు సీబీఐకి వెళ్తే క్లీన్ చిట్ ఇవ్వడం పక్కా అని పబ్లిక్గా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. సీబీఐ సహా వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించిన తీరుకు మీ నిస్సిగ్గు ప్రకటనలే నిదర్శనమన్నారు. ఒకప్పుడు సీబీఐకి కేసు వెళ్తే.. భయపడే పరిస్థితి.. నేడు సంబురాలు చేసుకుంటున్నారు. సీబీఐ సంస్థను బీజేపీ ఎంతగా నీరుగార్చిందో అర్థమవుతోందన్నారు.
కెమెరాల సాక్షిగా ప్రభుత్వాన్ని కూలదోసే యత్నం చేసి అడ్డంగా దొరికిన దొంగలు మీరు అని ధ్వజమెత్తారు. ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్లుగా ఉంది బీజేపీ వ్యవహారం అని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో బీజేపీ కాంగ్రెస్నే మించిపోయిందన్నారు. దొరికిన ముగ్గురికి లై డిటెక్టర్ టెస్టులు చేస్తే మీతో ఉన్న సంబంధం ఏంటో బయటపడుతుందన్నారు. ఇందుకు సిద్ధంగా ఉన్నారా..? దమ్ముంటే నా సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్లుగా ప్రత్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైనా ప్రభుత్వాలను కూల్చిన సిగ్గులేని చరిత్ర మీది అని ధ్వజమెత్తారు. నేరం చేసిన వారు ప్రజాకోర్టులో తప్పించుకోలేరు. బీజేపీపై తీర్పు చెప్పేందుకు యావత్ భారత్ సమాజం సిద్ధంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
కిషన్ రెడ్డి గారూ! మీకో సూటి ప్రశ్న.
ఆ సాములతో అసలు సంబంధమే లేదన్నోళ్లు…ఈ స్కాము సీబీఐకి అప్పగించగానే చంకలెందుకు గుద్దుకుంటున్నరు?మీ బండారమంతా కెమెరా కన్నుకు చిక్కినప్పుడే.. మీ వెన్నులో వణుకు మొదలైంది
అప్పుడు భుజాలు తడుముకున్న మీరు.. ఇప్పుడెందుకు వాళ్లను భుజాలపై మోస్తున్నారు?
— KTR (@KTRTRS) December 27, 2022