సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటనతో యువత అప్పుడే చదువులో పడిపోయారు. దురదృష్టం ఏందంటే.. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాల నేతలు పెద్దగా చదువుకున్నట్టు కనిపిస్తలేదు. సీఎం ప్రకటనను మేం నమ్మడం లేదంటున్నారు. ప్రభుత్వ అధినేతగా అసెంబ్లీలో చేసిన ప్రకటనను నమ్మేవాళ్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.. చదువు ప్రారంభించండి. ఎవరైతే సీఎం మాటలు నమ్మడం లేదంటున్నరో.. వాళ్లు మాత్రం ఇప్పటికే ప్రధాని మోదీ ప్రకటించిన రెండు కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. -అసెంబ్లీలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మార్చి 10 : బాత్ కరోడో మే.. కామ్ పకోడోమే.. ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానమని ఐటీ పరిశ్రమశాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. టీఆర్ఎస్ది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని.. అందుకే సీఎం కేసీఆర్.. అసెంబ్లీ సాక్షిగా 91 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని చెప్పారు. సీఎం ప్రకటనపై కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ దుగ్ధతో ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రకటనపై నమ్మకమున్నవాళ్లు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని.. నమ్మకం లేనివాళ్లు ప్రధానమంత్రి ఇస్తానన్న రెండుకోట్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎద్దేవాచేశారు. గురువారం అసెంబ్లీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ పద్దులపై చర్చలో భాగంగా మంత్రి కేటీఆర్ సభ్యుల ప్రశ్నలకు ఇచ్చిన వివరణ ఆయన మాటల్లోనే..
టీఎస్ఐపాస్లో అనుమతుల జారీపై చర్చకు సిద్ధం
టీఎస్ఐపాస్ పోర్టల్లో దరఖాస్తు చేస్తే 15 రోజుల్లోనే అనుమతి ఇస్తాం..ఇవ్వకపోతే 16వ రోజు అటోమెటిక్ అప్రూవల్ అని చెప్పిన ఏకైక ప్రభుత్వం తెలంగాణే. దీనివల్ల 19,145 అనుమతులు 15 రోజుల్లోనే మంజూరై 16.45 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇన్ని అనుమతులు ఎక్కడ ఇచ్చారు?అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. వాళ్లకు సమాధానం ఒక్కటే…పరిశ్రమల పూర్తి సమాచారం సభ ముందు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగ కల్పనలో సీఎం మూడు వ్యూహాలు తీసుకొన్నారు. ప్రభుత్వశాఖల్లో ఎన్ని ఖాళీలుంటే అన్నీ భర్తీ చేస్తున్నాం. దానికి అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనే నిదర్శనం. ప్రైవేటురంగంలో పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉద్యోగ కల్పనపై దృష్టిపెట్టాం. స్వయం ఉపాధి వైపు వెళ్లాలనుకొనేవారికి అవకాశాలు సృష్టిస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ఒక్కటే కాదు.. డెవలప్ అయిన స్కిల్ పైనా దృష్టి పెట్టాలన్న సీఎం సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నాం.
నమ్మిన వాళ్లకు మా ఉద్యోగాలు.. నమ్మని వాళ్లకు మోదీ ఉద్యోగాలు
ఉద్యోగా భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటనతో యువత రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకున్నరు. అప్పుడే చదువులో పడిపోయారు. దురదృష్టం ఏందంటే.. రాష్ట్రంలోని ప్రధానప్రతిపక్ష పార్టీల నాయకులు పెద్దగా చదువుకున్నట్టు కనిపిస్తలేదు. ముఖ్యమంత్రి గారి ప్రకటన మేం నమ్మడం లేదంటున్నారు. ప్రభుత్వాధినేతగా శాసనసభలో చేసిన ప్రకటనను నమ్మేవాళ్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.. చదువు ప్రారంభించండి. ఎవరైతే సీఎం మాటలు నమ్మడం లేదంటున్నరో.. వాళ్లు మాత్రం ఇప్పటికే ప్రధాని మోదీ ప్రకటించిన రెండు కోట్ల ఉద్యోగాలకు ఐప్లె చేసుకోవాలి. ‘ఏక్ సాల్ మే దో కరోడ్ యువాంకో రోజ్గార్ దేంగే..’ అని ప్రధాని మోదీ చెప్పారు. ఇప్పటికే ఏడేండ్లు అయింది. 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఏమైంది? ఒకసారి ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు మోదీగారిని ప్రశ్నిస్తే..‘ఆప్కీ టీవీ స్టూడియోకే సామ్నే ఏక్ యువ పకోడి బనారహే.. ఆప్ ఇస్కో రోజ్గారీ మాన్తే హీ నహీ’ అని ప్రశ్నించారు. అంటే పకోడీలు వేసుకోవడం ప్రధాని దృష్టిలో ఉద్యోగమన్నమాట. అసెంబ్లీ వేదికగా బీజేపీ విధానం గురించి నేను ఒక మాట చెప్తా. ‘బాత్ కరోడోమే..కామ్ పకోడోమే’.
నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లు పెడదాం
నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లు పెట్టి, మా పిల్లలకు భోజన వసతి కల్పించి ఉద్యోగాలకు శిక్షణ ఇప్పిస్తామంటూ మిత్రులు ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, సుదర్శన్రెడ్డి చేసిన ప్రకటనలు చూశాను. మిగతా ఎమ్మెల్యేలను కోరుతున్నా. ప్రతి నియోజకవర్గంలో మనమే కోచింగ్ క్యాంప్లు పెడదాం. మీకు కావాల్సిన మొత్తం సామగ్రి, విషయ పరిజ్ఞానమున్న ఇన్స్ట్రక్టర్లను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ట్రైనింగ్ కోసం టీశాట్ పేరిట అద్భుతమైన నెట్వర్క్ నడుపుతున్నాం. ఇస్రోతో ఒప్పందం చేసుకుని ఇంటింటికీ కేబుల్టీవీ ద్వారా ప్రతి పోటీపరీక్షకు బ్రహ్మాండంగా తయారయ్యేలా కోచింగ్ ఇస్తున్నాం. టీశాట్కు 35 లక్షల మంది సబ్స్ర్కైబర్స్ ఉన్నారు. యూ ట్యూబ్లో కూడా అందుబాటులో పెడుతున్నాం. అందుకే నేను కాంగ్రెస్ సభ్యులు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్బాబులను కూడా కోరుతున్నా. యువత మీద ప్రేమ ఉంటే మీరు కూడా ముందుకు రండి. కోచింగ్ సెంటర్లు నడపడంతో మీకు కూడా కొంత లాభం జరిగే అవకాశం ఉంటుంది.
చెప్పిన దానికంటే ఎక్కువే చేసి చూపాం
టీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చిన దానికంటే ఎక్కువే చేసి చూపింది. ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలు వస్తాయని గతంలోనే మేం మా మ్యానిఫెస్టోలో చెప్పాం. పోయిన టర్మ్ మా ప్రభుత్వంలో 1.32 లక్షల పైచిలుకు ఉద్యోగాలను భర్తీచేశాం. తాజాగా ముఖ్యమంత్రి ప్రకటించిన 91 వేల ఉద్యోగాలు కలిపితే 2 లక్షల 47వేల ఉద్యోగాలు ప్రభుత్వశాఖల్లో భర్తీ చేసిన, చేయబోతున్న ప్రభుత్వం తెలంగాణ అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోకానీ, తెలంగాణ చరిత్రలోకానీ ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఎంతో సావధానంగా ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి.. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు వస్తాయి.. మొత్తం కసరత్తు చేసి, 91 వేల పోస్టులు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. నేను ఈ రోజు కొన్ని పేపర్లలో చూశాను.. కొలువుల జాతర అని రాశారు. వాస్తవానికి ఇది కొలువుల జాతర కాదు.. కొలువుల కుంభమేళా. అందుకే నేను టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ తరఫున, తెలంగాణ యువత తరఫున సీఎం కేసీఆర్ గారికి పాదాభివందనం చేస్తున్నా.
సింగరేణిని అమ్మేసే కుట్ర
నష్టాల బాట పట్టించేందుకు ప్లాన్
దేశంలో ప్రస్తుతం బేచో ఇండియా స్కీం నడుస్తున్నదని అప్రమత్తంగా లేకపోతే సింగరేణిని అమ్మేస్తారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం అసెంబ్లీలో మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..
బేచో ఇండియా
ఇప్పుడు మోదీ నాయకత్వంలో దేశంలో బేచో ఇండియా స్కీం నడుస్తున్నది. ఇప్పటికే ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. నష్టాల్లో ఉన్నట్టు చూపి, టోకున అమ్మేస్తున్నారు. మనం అప్రమత్తం కాకపోతే సింగరేణిని కూడా అమ్మేస్తారు. అందుకే ఛత్తీస్గఢ్లో, గుజరాత్లో బొగ్గు గనులను ఆ ప్రాంతంలోని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎట్లా అయితే అప్పగించారో, సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు గనులను మా సంస్థకు అప్పగించండని సీఎం కేసీఆర్, ప్రధానికి మొన్ననే ఉత్తరం రాశారు. ఎందుకంటే సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి అత్యధిక లాభాల్లో దూసుకెళ్తున్న సంస్థ. దేశంలో 87 శాతం పీఎల్ఎఫ్ ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సింగరేణిలోనే ఉన్నది. దేశంలోనే అత్యధికంగా బోనస్లు సింగరేణి కార్మికులకు వస్తున్నాయి. 18 నుంచి 29 శాతానికి సింగరేణి కార్మికుల లాభాలు పెరిగాయి. కాబట్టే సింగరేణిని మాకు అప్పగించండి, వాటిని లాభాల్లో నడిపి మరిన్ని వేల మంది మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని మనం కేంద్రాన్ని అడుగుతున్నాం. కానీ, దాన్ని కేంద్రం బేఖాతర్ చేసి, బొగ్గుగనులను వేలం పెట్టి సింగరేణిని కూడా నష్టాల బాట పట్టించి, దాన్ని కూడా ఖతం చేయాలన్న ఎజెండాతో ముందుకు వెళ్తున్నది. దీనిపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడాలని నేను కోరుతున్న.
కాంగ్రెస్-బీజేపీ అవిభక్త కవలలు
మంత్రి కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ అవిభక్త కవలలుగా మారాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీలో మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..
వాళ్ల బాధేమిటో.. అసెంబ్లీ పోడియంలోకి వచ్చిన బీజేపీ సభ్యులను సస్పెండ్చేస్తే.. బీజేపీ వాళ్ల కంటే ఎక్కువగా కాంగ్రెస్ అధ్యక్షుడు బాధపడుతున్నారు. అంటే బీజేపీ, కాంగ్రెస్ ఒక అవిభక్త కవలల మాదిరిగా ఉన్నాయి. వీళ్ల అవగాహన ఏందో మాకు అర్థం కావట్లేదు. బయట చాలా పుకార్లు ఉన్నాయి. హుజూరాబాద్లో కలిసినట్టు, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కలిసినట్టుగా ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తున్నట్టుగా అనుమానాలు ఉన్నాయి. మా భట్టి విక్రమార్కగారు చాలా మంచివారు. దురదృష్టం ఏందంటే ఆ పార్టీలో భట్టిది నడ్వడం లేదు. గట్టి అక్రమార్కుల మాటే నడుస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్షుడికి సంస్కారం లేదు: మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
కాంగ్రెస్ పక్ష నేత భట్టివిక్రమార్క మాట్లాడుతుండగా..శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలుగ జేసుకొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడికి అసలు సంస్కారమే లేదు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజునాడు పిండం పెట్టాలని పిలుపునిచ్చిన వ్యక్తి గురించా మాట్లాడేది..సంస్కారం లేని వ్యక్తిని వెనుకేసుకొస్తున్నారా అని విమర్శించారు.