KTR | హైదరాబాద్/నిజామాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ‘కొవిడ్ సమయంలో నేను పసుపు రోగ నిరోధకశక్తి పెంచుతుందని చెప్పినప్పుడు కాంగ్రెస్ నన్ను ఎగతాళి చేసింది. వాళ్లు నన్ను అవమానించలేదు.. పసుపు రైతులను అవమానించారు’.. ఇవీ ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు.. పసుపు సెంటిమెంట్ను వాడుకొని రైతులను రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు మోదీ భారీ స్కెచ్ వేశారు. పసుపు రైతులపై ప్రేమ ఒలకబోశారు. ఈ వ్యాఖ్యలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. దీంతో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు తీసుకొస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు రైతులకు రాసిచ్చిన బాండ్పేపర్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
‘పార్లమెంట్ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఇస్తామని వాగ్దానం చేశారు. బాండ్పేపర్ కూడా రాసి ఇచ్చారు. అనేక నిరసనలు చేపట్టినప్పటికీ.. పసుపు బోర్డు ఇచ్చేందుకు నిరాకరించడం ద్వారా పసుపు రైతులకు నిజమైన అవమానం జరిగింది. నిజామాబాద్కు చెందిన మీ బీజేపీ ఎంపీ ఇచ్చిన బాండ్పేపర్ వాగ్దానం మీకు గుర్తుందా? సిగ్గుమాలిన ద్రోహం చేసినందుకు మోదీ ప్రభుత్వానికి పసుపు రైతులు తగిన గుణపాఠం చెప్తారు.’ అని కేటీఆర్ చురకలంటించారు. ఈ ట్వీట్పై రైతులు, యువకులు స్పందించారు. మోసం చేయడంలో ఆరితేరిన బీజేపీకి ఈ వాగ్దానాలు ఎలా గుర్తుంటాయి? అంటూ పలువురు నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఓట్లకోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని విమర్శించారు.