హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న దరిద్రపు ప్రభుత్వంగా మోదీ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. నరేంద్రమోదీ అస్తవ్యస్త, అనాలోచిత నిర్ణయాల వల్లే దేశ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి బలహీనపడిందని, 30 ఏండ్లలో ఎన్నడూ లేనవిధంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని, ఇప్పుడున్నంత నిరుద్యోగుల సంఖ్య గత 45 ఏండ్లలో ఎప్పుడూ లేదని, పేదరికం నిర్మూలనలో నైజీరియా కంటే దిగువకు భారత్ పడిపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారిపైకి తమ ప్రభుత్వ యంత్రాంగాలను ఉసిగొలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజా వ్యతిరేకమైనవిగా ఉన్నాయని పేర్కొంటూ ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాధారణ ప్రజలు ఉపయోగించే ప్రతి వస్తువు ధర భారీగా పెరిగిందని, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాల ఫలితమేనని కేటీఆర్ విమర్శించారు. ప్రజాస్వామ్య సూచీ మొదలుకొని పత్రికా స్వేచ్ఛ వరకు వెనుకబడి ఉన్న భారత్ ఆర్థిక అసమానతలు, అవినీతి విషయంలో మాత్రం గ్లోబల్ ర్యాంకుల్లో ముందంజలో ఉన్నదని, ఇది ముమ్మాటికీ మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కారు వైఫల్యమేనని దుయ్యబట్టారు. అనాలోచిత డీమానిటైజేషన్ (నోట్ల రద్దు), జీఎస్టీ అమలు వంటి నిర్ణయాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ చతికిలపడిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అన్ని కష్టాలకు ఒకే మందుగా పేర్కొన్న డిమానిటైజేషన్ వల్ల కొట్ల మంది ఉపాధితోపాటు, వందల మంది ప్రాణాలను కోల్పోయారని ఆయన గుర్తుచేశారు. మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల నల్లధనం వెనకి తెస్తామని చెప్పిన మోదీ మాటలు ముమ్మాటికీ అసత్యాలేనని తేలిపోయిందని మండిపడ్డారు. డీమానిటైజేషన్ అనంతరం తొలుత రూ. 18 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉంటే, ఇప్పుడు అది రూ. 31 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. నోట్ల రద్దు తర్వాత సుమారు 68 శాతం నగదు అధికంగా ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందని, కేవలం నగదు ముద్రణకే ఆర్బీఐ రూ. 8 వేల కోట్లు చేసిందని ఆయన వివరించారు.
పన్నులతో దోచుకుంటున్న కేంద్రం
జీఎస్టీ ద్వారా దేశ పౌరులను కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నదని, అర్థంలేని పన్నుల స్లాబ్లతోపాటు నిత్యావసర వస్తువులపై సైతం భారీగా పన్నులు విధించి దోపిడీ చేస్తున్నదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మరోవైపు పరిశ్రమలను, పారిశ్రామిక వర్గాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఉపయోగించే పాలు, పెరుగు, బియ్యం వంటి అత్యవసర వస్తువులపై సైతం భారీగా పన్ను మోపిన ప్రభుత్వం నరేంద్ర మోదీదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా చేనేత వస్ర్తాలపై సైతం జీఎస్టీని మోపిన ఘనత మోదీకే దక్కితుందని ఎద్దేవా చేశారు. పసిపిల్లలు వాడే పెన్సిళ్ల నుంచి హాస్పిటల్ బ్రెడ్ల (రొట్టెల) వరకు చివరికి అంత్యక్రియలకు కూడా పన్ను వేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని నిప్పులు చెరిగారు. మోదీ ప్రధాని కాకముందు పెట్రో పన్నుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ఆదాయం వచ్చేదని, ఇప్పుడు పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్నును భారీగా పెంచి కేంద్రమే రెండున్నర రెట్లు ఆదాయం పొందుతున్నదని పేర్కొన్నారు. పెట్రో పన్నుల పెంపు ప్రభావం దేశంలో ద్రవ్యోల్బణానికి దారి తీసి ప్రజల పాలిట శాపంగా మారిందని తెలిపారు.
పదవులు వీడుతున్న మేధావులు
కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు, అనాలోచిత నిర్ణయాలను భరించలేక ప్రపంచంలోనే అత్యంత పేరొందిన అనేకమంది ఆర్థికవేత్తలు, ప్రభుత్వ, ఆర్బీఐ పదవుల నుంచి వెళ్లిపోతున్నారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. తమ అసమర్థ విధానాలను బీజేపీ తన అబద్ధపు ప్రచార యంత్రాంగం ద్వారా కొవిడ్ సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటివాటిపైకి మోపేందుకు ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. లాక్డౌన్ కన్నా ముందే వరుసగా 8 త్రైమాసికాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి దిగజారిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం దిశగా తీసుకుపోతున్న మోదీ ప్రభుత్వం తమ మందబలం ద్వారా జీఎస్టీ కౌన్సిల్, పార్లమెంట్ వంటి వ్యవస్థలలో తప్పించుకోగలదేమో గానీ ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోలేదని కేటీఆర్ హెచ్చరించారు.
మోదీది క్రోనీ క్యాపిటలిజం
దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దూరదృష్టి లేకపోవడం, రానున్న సవాళ్లను అంచనా వేయలేకపోవడం, అనాలోచిత నిర్ణయాలు, తమ మిత్రులైన భారీ కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చే క్రోనీ క్యాపిటలిజం ఇవే మోదీ ప్రభుత్వ అసలైన ఆర్థిక విధానాలు అని కేటీఆర్ విమర్శించారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వ్యక్తులు, పార్టీలపైన తమ ప్రభుత్వ యంత్రాంగాలను ఉసిగొలిపి, విభజించి- పాలించు అనే దుర్నీతితో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా లేని తమ గొప్పలు చెప్పుకోవడం మాని, దేశ ప్రజల హితం దృష్ట్యా ద్రవ్యోల్బాణాన్ని అదుపులోకి తీసుకువచ్చి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలు తీసుకొవాలని కేటీఆర్ హితవు పలికారు.
నిర్మలా సీతారామన్ అబద్ధాలు..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థపై చేసిన దొంక తిరుగుడు ప్రసంగం కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను దాచలేవని కేటీఆర్ మండిపడ్డారు. పార్లమెంట్లో ఆర్థిక వ్యవస్థపై జరిగిన చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అసత్యాలు పలికారని విమర్శించారు. లోక్సభలో చేసిన వ్యాఖ్యల ద్వారా కోట్లాదిమంది భారతీయులు పడుతున్న కష్టాలను ఆమె అవహేళన చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను దాచేందుకు కేంద్ర మంత్రి ఎన్ని డొంక తిరుగుడు మాటలు చెప్పినా, తమ అసమర్థ, ఆర్థిక విధానాలతో దేశానికి కలుగుతున్న దారుణమైన ఫలితాలను, పరిణామాలను దాచలేరని ఆయన పేర్కొన్నారు.
ఎన్పీఏ జూమ్లానోమిక్స్ను దాచలేరు
విఫల ఆర్థిక విధానాలతో భారీ వినాశనం
కేంద్ర మంత్రి నిర్మలకు మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): కేంద్రంపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్), ప్రభుత్వ విఫల (డీమానిటైజేషన్) ఆర్థిక విధానాలు భారీ వినాశనానికి దారితీశాయని మండిపడ్డారు. కేంద్రం బ్రూట్ ఫోర్స్ ఉపయోగించి జీఎస్టీ కౌన్సిల్, పార్లమెంట్లో సమాధానాలు చెప్పకుండా తప్పించుకొన్నా, వాస్తవాల నుంచి తప్పించుకోలేదని స్పష్టం చేశారు. కొవిడ్కు ముందు వరుసగా 8 త్రైమాసికాల మందగమన భారాన్ని ఇప్పుడు దేశం మొత్తం భరిస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఓ ట్వీట్ చేశారు.
‘మేడమ్ నిర్మలా సీతారామన్ జీ.. మీరు సత్యాన్ని ఎంతగా వక్రీకరించినా ఎన్పీఏ, ప్రభుత్వ జూమ్లానోమిక్స్ (తప్పుడు ఆర్థికవిధానాల)ను దాచిపెట్టలేరు. 30 ఏండ్లలోకెల్లా ఇప్పుడు అత్యధిక ద్రవ్యోల్బణం, ఎప్పుడూ లేనంతగా రూపాయి బలహీనత, 45 ఏండ్లలో అత్యధిక నిరుద్యోగం, ప్రపంచంలోనే అత్యధిక ఎల్పీజీ ధర, పేదరికంలో నైజీరియాను భారత్ అధిగమించడం.. ఇవన్నీ కాదనలేని వాస్తవాలు’ అని తెలిపారు. పలు జాతీయ పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్లను మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో జత చేశారు.