Minister KTR | సీఎం కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అంటున్నారని, ఈటల నీకిది తగునా? అని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు. ‘సరిగ్గా 14 నెలల కిందట ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను గెలిపించారు. ఆయన ఎన్నో మాటలు చెప్పారు. అమిత్షాను తీసుకువస్తా.. నిధుల వరద పారిస్తాం, హుజూరాబాద్ను మార్చేస్తాం అన్నారు. పైనో ఇంజిన్ ఉన్నది, బండి సంజయ్ అనే ఇక్కడో ఇంజిన్ ఉన్నది. ఇద్దరం కలిసి పోడిచేస్తాం.. హుజూరాబాద్లో ఇదివరకు జరగని అద్భుతాలు అన్ని చేస్తామని చాలామాటలు చెప్పారు. రూ.3వేల పెన్షన్ ఇస్తామన్నరు. నిధుల వరద పారిస్తామని చెప్పారు. ఒక్క పైసా ఢిల్లీ నుంచి వచ్చిందా? అని ఆలోచించాలని కోరుతున్నా. మాటలు కోటలు దాటుతయ్.. చేతలు మాత్రం కడప దాటయ్. ఎన్నికల్లో బాగా నరికారు’ అంటూ మండిపడ్డారు కేటీఆర్.
‘నెల రోజుల కిందట ఈటల రాజేందర్ కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఉన్నడని హుజూరాబాద్ నియోజకవర్గానికి పరిచయం చేసింది తండ్రిలాంటి కేసీఆర్ కాదా? 33 మంది టికెట్ కోసం పోటీపడ్డా వాళ్లందరిని కాదని అవకాశం ఇస్తే.. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టు తండ్రిలాంటి కేసీఆర్ను పట్టుకొని కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అనవచ్చునా? రాజకీయంగా వేరుపడినా.. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని, తండ్రిలాంటి వ్యక్తిని పట్టుకొని అరిష్టమని మాట్లాడుతున్నరు ఇది మీకు తగునా అని ప్రశ్నిస్తున్నా. ఎవరి పాలన ఈ దేశానికి, రాష్ట్రానికి అరిష్టమో ప్రజలు ఆలోచన చేయాలి. ఎన్ని మాటలు చెప్పి 2014లో అధికారంలోకి వచ్చారు. ప్రధాని మోదీ జన్ధన్ ఖాతాలు తెరిస్తే.. ఖాతాల్లో రూ.15లక్షలు ధనాధన్ వేస్తానని చెప్పారు. మరి హుజూరాబాద్లో, దేశంలో ఎవరికైనా వచ్చాయా? అందరి డబ్బులు ఒక్కడి ఖాతాలో పడ్డయ్. ఆ ఒక్కడు ప్రపంచంలో కుబేరుడై కుసున్నడు. దొంగ, మంది సొమ్ము తిని అదాని ఒక్కడే బాగుపడ్డాడు. ఇంకా ఎవరూ బాగుపడలే’ అంటూ ధ్వజమెత్తారు.
‘2022 నాటికి ఇండ్లు లేని వారందరికీ భారత్లో ఇండ్లు ఇస్తాం. రైతుల ఆదాయం డబుల్ చేస్తా. ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లిస్తా. కరెంటు లేని ఊరు ఉండది. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా.. ఇవన్నీ మోదీ చెప్పినా మాటలు కావా? 2022 వరకు కల్లా భారతదేశాన్ని భూతలస్వర్గం చేస్తా.. అమెరికావాళ్లే వచ్చి లైన్ కట్టాలి వీసాల కోసం చేస్తా అని చెప్పిన మాట వాస్తం కాదా? 2022 దాటి 2023 వచ్చింది మరి ఏమైంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మోదీ దేవుడు అంటున్నడు. ఎవడికి దేవుడు. అయితే నీకు దీవుడేమో సీటిచ్చినందుకు. ఎవరికి దేవుడు ఈ దేశంలో మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి. రూ.400 ఉన్న సిలిండర్ను రూ.1200 చేసినోడు దేవుడా? 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎనిమిదేళ్లలో యువతను మోసం చేసిందుకు యువతకు దేవుడా? పప్పు, నూనె, చింతపండు ధరలు పెరిగినయ్ అంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం కాదా? 2014 మోదీ అధికారంలోకి వచ్చిన రోజు పెట్రోల్ లీటర్కు రూ.70. క్రూడాయిల్ బ్యారెల్కు డాలర్కు 90. ఇప్పుడు అదే ధర ఉన్నది. ఆ రోజు 90 డాలర్లు బ్యారెల్. ఈ రోజు 90 డాలర్లు బ్యారెల్కు. ఆ రోజు పెట్రోల్ రూ.70 ఇవాళ రూ.110 ఎలా పెరిగింది? నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో పేదలను కొట్టి.. పేదలకు పెట్టే ప్రభుత్వం. కాకులను కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వం’ అంటూ కేటీఆర్ విమర్శించారు.