Minister KTR | కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్లీ రూ.200 పెన్షన్, 3 గంటల కరెంటు వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘కాంగ్రెస్ హయాంలో పెన్షన్ కూడా సరిగా లేదు. చారానకోడికి బారాన మసాలా అన్నట్లుగా ఇచ్చినోళ్లు ఇంద్రుడు చంద్రుడు అని డబ్బా కొట్టుకుంటూ పెద్ద పెద్ద బిల్డప్లు. జడ్చర్ల నియోజకవర్గంలోనే 32,477 మందికి నెలకు రూ.2వేలు, రూ.3వేల చొప్పున ఆసరా పెన్షన్లు ఇచ్చి.. పెద్ద మనుషుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ హయాంలో సంవత్సరానికి రూ.800కోట్లు పెన్షన్లకు ఖర్చు చేస్తే.. తెలంగాణ ప్రభుత్వంలో 46లక్షల మందికి సంవత్సరానికి రూ.12వేలకోట్లు ఖర్చు చేస్తున్నాం. మేము చెప్పేదైతే కాంగ్రెస్ నాయకులు లెక్కలతో వస్తే లక్ష్మారెడ్డి చర్చలకు సిద్ధంగా ఉన్నారు’ అని స్పష్టం చేశారు.
‘ఏ రంగంలో చర్చకు వస్తరో రండి. మీరు చేసి ఉద్దారకమేంది. మేం చెడగొట్టిందేది. మేము అన్నీ బాగుచేశాం. కానీ ఇవాళ నోటికి వచ్చిక బూతులు మాట్లాడుతున్నరు. జడ్చర్లలో కాంగ్రెస్ అభివృద్ధి కనిపిస్తలేరు. దశాబ్దాలు మీరు పీకి పందిరేస్తే.. మేం వచ్చి చెడగొట్టినం. జడ్చర్లను గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా చేసేందుకు త్వరలోనే ఆదేశాలిస్తాం. ఎమ్మెల్యే కోరిక మేరకు రూ.30కోట్ల నిధులు త్వరలోనే విడుదల చేస్తాం. సీఎం కేసీఆర్ రాక ముందు చెరువు, సాగునీరును ఎవరూ పట్టించుకోలేదు. రైతాంగం కరెంటు రాక ఆకాశం వైపు చూసుకుంటే ఉండే పరిస్థితుల్లో.. అప్పులపాలై సచ్చిపోయినా ఎవరూ పట్టించుకోలే. కేసీఆర్ వచ్చాక ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయని ఆలోచన చేశారు. వానాకాలం నాట్లు వేసే టైమ్ వచ్చిందంటే ఇవాళ మీ ఫోన్లు టింగు టింగుమని మోగుతలేవా? రైతుబంధు మీ ఖాతాల్లో పడుతలేదా? ఎకరం పొలం ఉంటే రూ.10వేలు వస్తున్న మాట వాస్తవం కాదా? ఒక్క జడ్చర్ల నియోజకవర్గంలోనే రైతుబంధు కింద 88,591 మంది రైతులకు ఇప్పటికీ రూ.900కోట్లకుపైగా ఖాతాల్లో జమ చేశాం’ అని తెలిపారు.
‘రైతులను నేను అడుగున్నా ఎవరైనా కాంగ్రెసోళ్లు అరపైసా ఇచ్చారా? పంట పెట్టుబడి కింద అరపైస పంట సాయం చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నారా ఈ దేశంలో. మరి వాళ్లు అధికారంలో ఉన్న నాడు ఎందుకు ఆలోచన చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న నాయకుడు, దిల్ ఉన్న నాయకుడు కాబట్టే.. ఏ రైతు కుటుంబం రోడ్డున పడకూడదని రూ.5లక్షల రైతు బీమా అమలు చేస్తున్నరు. రైతు రూపాయి కట్టనవసరం లేకుండా ప్రభుత్వమే రూ.1450కోట్లు చెల్లించి రైతులకు రైతుబీమా అమలు చేయిస్తున్న నేత కేసీఆర్. జడ్చర్లలో రైతుబీమా కింద 1430 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబం ఖాతాలో రూ.5లక్షలు జమ చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దేశంలో నాలుగైదు చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఎక్కడైనా రైతుబీమా, రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ సంస్కారం ఉన్నదా? మీరు వచ్చి మాపై మాట్లాడుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ గిరిజనులకు రిజర్వేషన్ను 6 నుంచి 10శాతానికి పెంచామని, పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.