హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలెవరూ కోరుకోవడం లేదని, రాజకీయ నిరుద్యోగులు మాత్రమే మార్పు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లో ఒక చానల్ నిర్వహించిన కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిజమైన మార్పు 2014లోనే వచ్చిందని, 2014లో అది మరింత ప్రబలమైందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో అణచివేతకు గురైన తెలంగాణ ప్రజలు 14 ఏండ్లపాటు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాడి తెలంగాణ సాధించుకోవడమే అసలైన మార్పు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలోని కరువుకాటకాలు, గంజి కేంద్రాలు, నిరుద్యోగం, నక్సలిజం, దోపిడీని ప్రజలు మళ్లీ కోరకుంటున్నారా అని ప్రశ్నించారు.
ఇందిరమ్మ రాజ్యం అట్టర్ఫ్లాప్ కావడం వల్లే ఎన్టీఆర్ను ప్రజలు నెత్తినపెట్టుకొని 9 నెలల్లోనే అధికారం కట్టబెట్టారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, సమాజంలో ఎన్టీఆర్ వచ్చాకే మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పాలనలో సామాజిక మార్పుతో పాటు ప్రజల జీవన పరిస్థితుల్లో కూడా పెను మార్పులు సంభవించాయని వివరించారు. ఎన్టీఆర్ తర్వాత ఆయన శిష్యుడైన కేసీఆర్ తెలంగాణలో రెండుసారు ్ల ముఖ్యమంత్రిగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, ఎన్టీఆర్ కూడా సాధించలేని ఘనతను ఆయన శిష్యుడు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఆ ప్రచారం మీడియా సృష్టే
సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని, బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత మీడియా సృష్టి మాత్రమేనని తేల్చి చెప్పారు. ఆరు నెలలకోసారి సీఎంలు మార్చే వారిని కాకుండా స్థిరమైన, బలమైన ప్రభుత్వాన్నే తెలంగాణ ప్రజలు కోరుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీది హడావుడి తప్ప క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఆదరణ లేదని పేర్కొన్నారు. బీజేపీ బలం తగ్గడం వల్లే కాంగ్రెస్ బలం పెరిగిందని అనుకుంటున్నారని వివరించారు. బీఆర్ఎస్ ఓటుబ్యాంకు చెక్కుచెదరలేదని, నంబర్ 2 స్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్నాయని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపులో గొప్పతనం ఏమీ లేదని, 30శాతం కమిషన్ ప్రచారంతోనే బీజేపీ ఓడిందని విశ్లేషించారు. రేవంత్ రూ.50కోట్లు పెట్టి పీసీసీ పదవి కొనుకున్నారని, కోట్లకు టికెట్లు అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇక గతమని.. బీఆర్ఎస్సే భవిష్యత్తు అని స్పష్టం చేశారు. భవిష్యత్తును కోరుకునే వారు బీఆర్ఎస్కు ఓటెయ్యాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.