minister ktr | దొంగనే దొంగ అన్నట్లుగా బీజేపీ వ్యవహారం ఉందని.. దొంగపనులు చేసి మళ్లీ ఇతరులపై నెపం పెట్టిన వారికి మునుగోడు ప్రజానీకం కర్రకాల్చి వాతపెట్టారన్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మునుగోడు చైతన్యానికి ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ‘డబ్బులు ఇచ్చి కొందరు అభ్యర్థులను నిలబెట్టారు. గుర్తులను పోలిన గుర్తులు రోడ్డు రోలర్, చపాతీ మేకర్ను తీసుకువచ్చి దాదాపు 6వేల ఓట్లు వాళ్లకు పడేలా కన్ఫూజన్కు గురి చేసే ప్రయత్నం చేశారు. ఇంకా దారుణం ఏంటంటే ఫేక్ ప్రచారాలు.
బీజేపీ ప్రచారం అంటేనే.. ఒక ఆర్ట్ కింద మారిపోయింది. ఫేక్ అనేది లేకుంటే ప్రచారం ఉండదు.. ఆల్ ఫేక్ పార్టీ బీజేపీ పైనుంచి కింది వరకు. పోటీలో దొంగ ఇండిపెండెంట్లను నిలబెట్టి శిఖండి రాజకీయం చేశారు. వారికి కేటాయించిన గుర్తులు ఫేక్. రూ.3వేల పింఛన్ హామీ ఫేక్. రూ.1000కోట్ల నిధులు తెస్తానని చెప్పడం ఫేక్. అభ్యర్థికి అర్జెంట్గా జ్వరం రావడం ఫేక్. కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్లో చేరిందన్న ప్రచారం ఫేక్. మా పార్టీ నేత కర్నె ప్రభాకర్ బీజేపీలో చేరుతున్నాడని అడ్డగోలు ప్రచారం చేయడం ఇంకో ఫేక్’ అంటూ మండిపడ్డారు.
‘పోలింగ్ రోజు న్యూస్చానల్స్, పత్రికల పేరుతో, కొత్త కొత్త సర్వేలతో చేసిన ప్రచారం ఫేక్. ఎన్నికల సందర్భంగా జరిగిన ఐటీ దాడులు, దాని వెనుక జరిగిన ప్రచారం ఫేక్. మా మంత్రి జగదీష్రెడ్డి ఏపీ వద్ద డబ్బులు దొరికాయన్నది ఫేక్. రాజగోపాల్రెడ్డి మునుగోడులో లేని ఓటును వేసినట్లుగా చెప్పడం అదొక ఫేక్ రాజకీయం. మొత్తం ఫేకుడే.. పైనున్నడో ఫేకుడు.. కిందున్నోడు జోకుడు తప్ప చేసిందేమీ లేదు. అక్కడున్నోడు నేను కరోనా వ్యాక్సిన్ కనిపెట్టామని ఒకడు చెబుతడు.. ఇంకొకుడు రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఆపిండని చెబుతడు. ఇంత దరిద్రమైన పద్ధతి అంటే.. మా ఓటర్ల వద్దకు వెళ్లి.. మహిళ ఓటర్ల చేతులకు గోరింటాతో కమలం పువ్వు గుర్తు వేయడం కంటే చిల్లర పని ఉంటదా? దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా కొట్టాడాలి.
ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. ఎన్నికల కమిషన్పైనా దాడి చేస్తున్నరు. ఎన్నికల కమిషన్ ఇవాళ ఎవరి ఆధీనంలో ఉన్నది? ఎవని ఆధీనంలో పని చేస్తుందో ఇక్కడున్న బీజేపీ అధ్యక్షుడికి తెలియదు. ఆయనకు ఎవరు సైతం చెబుతలేరు. నోటికి ఎంత వస్తే అంత ఒర్రుడే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.. బీజేపీ గవర్నమెంట్ కింద పని చేస్తుంది ఢిల్లీలో.. వాళ్లను తిడుతున్నవంటే మోదీని తిడుతున్నట్టే లెక్కా.. అది కూడా తెల్వదు ఆయనకు. బ్రహ్మాండంగా గడ్డి పెట్టి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెబినందుకు మునుగోడు ప్రజలకు, గులాబీ శ్రేణులు, కామ్రేడ్ సోదరులకు ధన్యవాదాలు’ అన్నారు కేటీఆర్.
ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షా, ఇతర బీజేపీ జాతీయ నాయకులు ప్రచారం చేశారని గుర్తు చేసిన కేటీఆర్.. పార్టీ కార్యకర్తలు శాసన సభ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే పాల్గొనొద్దా? అన్ని ప్రశ్నించారు. వామపక్షాలతో పొత్తు కొనసాగింపుపై సీఎం కేసీఆర్, వామపక్షాల అగ్రనేతలు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా అధికారికంగా గుర్తించిన తర్వాత బీఆర్ఎస్ కార్యాచరణ ప్రణాళికను నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.