Minister KTR | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా వినియోగదారులు, రైతులతో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. సెస్ ఎన్నికల సమయంలో బండి సంజయ్ రూ.5కోట్లు తీసుకువచ్చాడని.. అభ్యర్థులు ఆగమై తనకు ఫోన్లు చేశారని చెప్పారు. డబ్బులు పంచినోళ్లే మళ్లీ బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
గుజరాత్ పైసలు ఎన్ని వచ్చినా.. కేసీఆర్నే ముఖ్యమంత్రిని చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా దిశానిర్దేశం చేసిందన్నారు. సెస్లో గెలువలేనోడు రాష్ట్రంలో గెలుస్తారా?.. మొన్న చూసింది ట్రైలరే.. 2023లో అసలు సినిమా చూపిస్తాం అన్నారు. తెలంగాణలో బీజేపీని నడిపేవాళ్లు మూర్ఖులని.. మెదడు ఎక్కడుంది? మోకాళ్లలో ఉందా?.. దమ్ముంటే తమకంటే ఎక్కువగా మంచి పనులు చేసి ప్రజల మనసులను గెలవాలని హితవు పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్ల అభివృద్ధిలో దేశం మొత్తంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ను సరఫరా చేయాలని, సిరిసిల్ల జిల్లా సెస్ పరిధిలో ప్రత్యేక విద్యుత్ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎన్ని నిధులైనా ఇప్పిస్తానన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎవరికి దేవుడు..? నీకా? గుజరాత్ కా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని నిలదీశారు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచినోడని, నల్లచట్టాలు తెచ్చి రైతులను చంపినోడు దేవుడట.. చేనేత మీద పన్నువేసినోడు దేవుడా? అంటూ నిలదీశారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ.. ఆర్టీసీ ధరలు పెంచొద్దంటారని.. మరి బస్సులు ఎలా నడుపమంటారని ధ్వజమెత్తారు. కేంద్ర ధరలు పెంచడంలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయని స్పష్టం చేశారు.
కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు గొడవ నడుస్తుందన్న కేటీఆర్.. ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రాల గొడవ పరిష్కరించని మోదీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపారా? అని ప్రశ్నించారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పు.. మోదీ ఒక్కరే చేశారని విమర్శించారు. కిషన్రెడ్డి కరోనా సమయంలో కుర్కురే ప్యాకెట్లు పంచారని విమర్శించిన కేటీఆర్.. తెలంగాణకు కేంద్ర నిధుల విషయంలో సవాల్ విసిరారు.
రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.1.68లక్షల కోట్లు వెళ్లాయని, కేంద్రం తెలంగాణకు రూ.2లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. నేను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. గుజరాత్ వాళ్లు వస్తే చెప్పులు మోయడానికి పని చేస్తారని, నాలుగేళ్లలో కరీంనగర్కు ఎంపీగా ఉండి బండి సంజయ్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఐటీ, నవోదయ పాఠశాలలు తీసుకువచ్చావా? అంటూ నిలదీశారు. రాజరాజేశ్వరస్వామికి రూ.10 చందా అయినా రాయించావా? అంటూ ధ్వజమెత్తారు. ఈ సారి కరీంనగర్ పార్లమెంట్పై గులాబీ జెండాను ఎగురవేద్దామని, సిరిసిల్ల నుంచి విజయయాత్ర ప్రారంభించి.. ఇక్కడి నుంచే కరీంనగర్ గులాబీ జెండా ఎగురవేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.