వరంగల్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇది టెన్ జన్పథ్ కాదు.. తెలంగాణ జనపథం అని రాహుల్కు కేటీఆర్ చురకలంటించారు. రాహుల్ గాంధీ.. మీరు చెప్పిందల్లా నమ్మడానికి, పరిజ్ఞానం లేని మాటలను విశ్వసించడానికి ఇది టెన్ జన్పథ్ కాదు.. ఇది చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ జనపథం. ఇక్కడ మీరు ఆడిచ్చినట్టు ఆడటానికి ఎవరూ లేరు. కాంగ్రెస్ నాయకుల్లాగా అవగాహన లేని వారు ఇక్కడ ఎవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ గురించి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా జోడించి అన్ని రంగాల్లో సమ్మిళితమైన అభివృద్ధిని సాధిస్తున్నారని తెలిపారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయని విధంగా గత ఏండేండ్లలో అద్వితీయమైన విజయాలు సాధించి, ప్రగతి పథంలో దూసుకుపోతున్నామని స్పష్టం చేశారు. ఇది మేం చెప్పట్లేదు.. కేంద్రమే చెప్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని డిపార్ట్మెంట్లకు కేంద్రం నుంచి అవార్డులు, కితాబులు వస్తున్నాయని చెప్పారు.
తమ భావ దారిద్ర్యాన్ని, దివాళా కోరుతునాన్ని, రాజకీయ అజ్ఞానాన్ని, అవగాహన రాహిత్యాన్ని తెలంగాణ ప్రజల ముందు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏ పదవిలో వరంగల్కు వచ్చారో మాకు తెలియదని కేటీఆర్ అన్నారు. మమ్మీ గారు అధ్యక్షురాలు.. మరి ఈయన డమ్మీ గారు ఏంటో మాకు తెల్వదు. ఈ డమ్మీ గారు ఎంపీనా, అధ్యక్షుడా మాకు తెల్వదు. ఎప్పుడు ఇండియాలో ఉంటడో.. ఎప్పుడు బయట ఉంటడో మాకు తెల్వదు. ఏ హోదాలో కాంగ్రెస్ పార్టీ అల్లం బెల్లం చేస్తదని డైలాగ్లు కొట్టారో కూడా తెలియదని కేటీఆర్ అన్నారు.
తమకు ఒక్క చాన్స్ ఇవ్వాలని రాహుల్ గాంధీ అంటున్నారు.. ఒక్క ఛాన్స్ కాదు.. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి పది ఛాన్సులు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. 50 ఏండ్లు ఈ దేశాన్ని మీకే అప్పగించారు. కరెంట్, నీళ్లు ఇవ్వలేని అసమర్థ పార్టీ. రైతుల ఆత్మహత్యలను నివారించలేని అసమర్థ పార్టీ. అవకాశం ఇచ్చినప్పుడు వెలగబెట్టలేదు కానీ ఇప్పుడేదో చేస్తరట అని విమర్శించారు.
తెలంగాణలో రిమోట్ కంట్రోల్ పాలన ఉందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ పేరుకు ప్రధాని.. నిర్ణయాలు మాత్రం సోనియావే. రిమోట్ కంట్రోల్ పాలన ఎవరిది? మీ కాంగ్రెస్ పార్టీది కాదా? అని ప్రశ్నించారు. రిమోట్ కంట్రోల్ పాలన చేసింది మీరే.. మీ నాయకురాలే. నేరపూరితమైన రాజకీయాలను అరికట్టాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్లో నిర్ణయ తీసుకొని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్ను చింపేసింది రాహుల్ గాందీ కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.