హైదరాబాద్ : నగరంలోని జేబీఎస్ పరిధిలో స్కై వే నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. స్కైవే నిర్మాణానికి కంటోన్మెంట్ భూములను ఇవ్వాలని కేంద్రాన్ని కోరినప్పటికీ స్పందన లేదు అని కేటీఆర్ తెలిపారు.
అయితే జేబీఎస్ నుంచి అల్వాల్, హకీంపేట్ వైపు వెళ్లే రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయని ఓ నెటిజన్ కేటీఆర్కు ట్వీట్ చేశారు. ఈ మార్గంలో ఎస్ఆర్డీపీ కింద రోడ్లను డెవలప్ చేస్తే జర్నీకి గంట సమయం తగ్గే అవకాశం ఉందన్నారు.
దీనిపై కేటీఆర్ స్పందించారు. ఎస్ఆర్డీపీ కింద స్కైవేను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ కేంద్రం నుంచి స్పందన లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ ఏరియాలో రోడ్డు విస్తరణకు కావాల్సిన రక్షణ శాఖ భూములివ్వాలని కోరినప్పటికీ కేంద్రం నుంచి స్పందన కరువైందన్నారు.
స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు కావాలి. భూములు ఇవ్వాలని ఏడున్నరేళ్లుగా కేంద్రాన్ని అడుగుతున్నాం. భూములిస్తే డబ్బులు లేదా మరో చోట భూమి ఇస్తామని చెప్పాం. ఇరవై సార్లు అడిగినా కేంద్రం ఇంత వరకు స్పందించలేదు అని కేటీఆర్ ఇటీవలే మీడియాతో పేర్కొన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ హైదరాబాద్కు పైసా సాయం చేయలేదు. హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో రూ. 7,800 కోట్లు కోరాం. గుజరాత్కు మాత్రం వెంటనే వరద సాయం చేస్తారు. ఈ బడ్జెట్లోనైనా ఏమైనా సాయం చేస్తారేమో చూడాలి. తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో రాజీలేని పోరాటం చేయాలి. తెలంగాణ పట్ల కేంద్రం దుర్నీతి, వివక్షను ప్రజలకు వివరిస్తాం అని మంత్రి తెలిపారు.