హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ఆర్థిక విధానాలను కేటీఆర్ దుయ్యబట్టారు. మోదీ అస్తవ్యస్త, అనాలోచిత నిర్ణయాల వల్లనే దేశ ప్రజలకు కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. తమ తప్పుడు ఆర్థిక విధానాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం అనేక అబద్ధాలు చెప్తుందని ధ్వజమెత్తారు. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్ధిక నిర్ణయాలు తీసుకున్న దరిద్రపు ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం చరిత్రలో నిలుస్తుందన్నారు కేటీఆర్. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి బలహీనపడడం, 30 సంవత్సరాల్లోనే అత్యధిక ద్రవ్యోల్బణం, 45 సంవత్సరాల అత్యధిక నిరుద్యోగం, నైజీరియా లాంటి దేశాల కన్నా తక్కువ స్ధాయికి పేదరిక ప్రమాణాల్లో భారత్ వెనకబడి ఉండడం వంటి అనేక దుష్పరిణామాలే ఇందుకు ఉదాహరణలు అని కేటీఆర్ తెలిపారు.
విద్యార్థులు ఉపయోగించే పెన్సిల్స్ నుంచి మొదలుకొని హాస్పిటల్ బెడ్లు, అంత్యక్రియల వరకు అన్నింటిపై పన్ను వేస్తూ ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం నరేంద్ర మోదీది అని కేటీఆర్ మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దూరదృష్టి లేకపోవడం, రానున్న సవాళ్లను అంచనా వేయలేకపోవడం, అనాలోచిత నిర్ణయాలు, తమ మిత్రులైన భారీ కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చే క్రోనీ క్యాపిటలిజం ఇవే మోదీ ప్రభుత్వ అసలైన ఆర్థిక విధానాలని కేటీఆర్ పేర్కొన్నారు.
కేంద్రం విభజించు పాలించు విధానంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వైఫల్యాలను ఎండగట్టిన వారిపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ, కేంద్ర సంస్థలతో కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. తమ అబద్ధపు మాటలతో, మందబలంతో పార్లమెంట్లో నెగ్గుకొచ్చినా, దేశ ప్రజల ముందు ఏదో ఒకరోజు మోదీ దోషిగా నిలబడాల్సిందేనని కేటీఆర్ పేర్కొన్నారు. లేని గొప్పలు మాని ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలని కేంద్రానికి కేటీఆర్ హితవు పలికారు.