హైదరాబాద్ : ప్రధాని మోదీ ప్రభుత్వం కామన్ మ్యాన్ ప్రభుత్వం కాదని,కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వంగా మారిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. అడ్డగోలుగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు, సెస్సులు, పన్నులతో దేశ ప్రజానీకానికి భారంగా మారిన పెట్రో ధరలను తగ్గించకుండా, కార్పొరేట్ ఆయిల్ కంపెనీలపై విండ్ ఫాల్ టాక్సులు తగ్గించిన కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి దేశ ప్రజల ఆర్థిక కష్టాలు కనపడవన్న కేటీఆర్, కేవలం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనం కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ఒకవైపు సెస్సులు, సుంకాల పేరుతో పెట్రో ధరలను భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం, పెట్రో భారం నుంచి ఉపశమనం కావాలని ప్రజలు కోరితే ఏ మాత్రం పట్టించుకోకుండా కార్పొరేట్ ఆయిల్ కంపెనీలకు విండ్ ఫాల్ టాక్సును తగ్గించి తన దుర్మార్గపూరిత ఆర్థిక విధానాలను కేంద్రం మరోసారి బయటపెట్టుకుందని కేటీఆర్ ఆరోపించారు.
కార్పొరేట్లకు వరాలిస్తూ, సామాన్యులపై భారం మోపడం, చమురు కంపెనీలకు లాభాలు వచ్చేలా చూస్తూ, జనం జేబులకు చిల్లులు పెట్టడమే బీజేపీ ప్రభుత్వ విధానంగా మారిందన్నారు. పెట్రోల్, డీజిల్పై విధించిన అదనపు పన్నులు, ఎక్సైజ్ సుంకాలు, సెస్సులను తగ్గించాలని దేశ ప్రజలంతా డిమాండ్ చేస్తుంటే కనీసం పట్టించుకోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు విండ్ ఫాల్ పన్నులను తగ్గించిందని కేటీఆర్ విమర్శించారు. తాజా నిర్ణయంతో తమ ప్రథమ ప్రాధాన్యత కార్పొరేట్ కంపెనీలే కానీ, దేశ ప్రజలు కాదని మోడీ సర్కార్ మరోసారి నిరూపించుకుందన్నారు. అడ్డగోలుగా ఈ కార్పొరేట్ కంపెనీలు సంపాదించిన చమురు సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెలుతున్నాయో అందరికీ తెలుసని కేటీఆర్ అన్నారు.
దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలకు రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపించి సామాన్య ప్రజలను బీజేపీ ప్రభుత్వం దోచుకుందని కేటీఆర్ విమర్శించారు. పెట్రో రేట్లు తగ్గించడానికి రష్యా నుంచి తక్కువ రేటుకి ముడిచమురు కొంటున్నామని గప్పాలు కొట్టుకున్న మోదీ ప్రభుత్వం, ఆ ఇంధనాన్ని దేశీయ అవసరాలకు వాడకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు కార్పోరేట్ ఆయిల్ కంపెనీలకు అనుమతి ఎందుకు ఇచ్చిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రష్యా నుంచి తక్కువ ధరకు కొని, దాన్ని ఇతర దేశాలకు భారీగా ఎగుమతి చేసి కార్పోరేట్ ఆయిల్ కంపెనీలు అడ్డగోలుగా సంపాదించిన సొమ్ములపై టాక్స్ తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వ అంతర్యాన్ని కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రధానమంత్రి మోదీ కార్పొరేట్ మిత్రులకు చెందిన రెండు కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్రం విండ్ ఫాల్ టాక్స్ ని తగ్గించిందని కేటీఆర్ ఆరోపించారు. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమరులో 3/4 వంతును శుద్ధిచేసిన కార్పోరేట్ ఆయిల్ కంపెనీలు ఆ ఇంధనాన్ని దేశంలో అమ్మకుండా విదేశాలకు ఎగమతి చేసుకున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ ప్రక్రియలో సాధారణ ప్రజలకు అణా పైసా లాభం కలగలేదని కేటీఆర్ అన్నారు. తక్కువ రేటుకి రష్యా నుంచి ముడి చమురు కొనడం ద్వారా 35 వేల కోట్ల రూపాయల భారం దేశంపైన తగ్గిందని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, మరి ఆ మేరకు దేశ ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో ఎందుకు విఫలమైందో వివరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం ఒకటి, రెండు కంపెనీలే ఈ 35 వేల కోట్ల రూపాయలను లాభాలుగా మార్చుకున్నాయా? అన్న విషయాన్ని కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విండ్ ఫాల్ టాక్స్ తగ్గింపుతో మోడీకి మిత్రులుగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు జాక్ పాట్ కొట్టాయని అయితే దేశ ప్రజలు మాత్రం విపరీతమైన పన్నుల భారాన్ని మోస్తూ కేంద్ర ప్రభుత్వానికి నిలువు దోపిడీ సమర్పించుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ లాంటి రాష్ట్రాలు 2014 నుంచి వ్యాట్ను ఏమాత్రం పెంచకున్నా… వ్యాట్ను తగ్గించడం లేదని పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని కేటీఆర్ విమర్శించారు. సెస్ల పేరుతో రూ. 30 లక్షల కోట్లు కొల్లగొట్టి… రాష్ట్రాల పన్నుల వాటాకు ఎసరు పెట్టి…ఉల్టా రాష్ట్రాల పైన కేంద్ర ప్రభుత్వం నిందలు వేస్తున్నదని మండిపడ్డారు. దేశంలో పెట్రోల్ ధరలు పెరగడానికి రాష్ట్రాల వ్యాట్ పెంపు కారణం కానే కాదన్న కేటీఆర్, మోదీ ప్రభుత్వం భారీగా పెంచిన సెస్సుల ఫలితంగానే పెట్రో రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. సెస్సుల రూపంలో ఇప్పటివరకు రూ. 30 లక్షల కోట్లను దేశ ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం దోచుకుందని వీటిని తగ్గిస్తే పెట్రోలు రూ. 70,డీజిల్ రూ. 60కే ప్రజలకు అందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. తన కార్పోరేట్ మిత్రుల ప్రయోజనాల కోసం ఎన్నో అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ ఒక్క విషయంలో దేశ ప్రజల మీద జాలి చూపిస్తే పెట్రో రేట్లు భారీగా తగ్గి సామాన్యుడికి లాభం కలుగుతుందన్నారు.
దేశ ప్రగతి, ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్షుద్ర రాజకీయాలతో కాలం గడుపుతుందని కేటీఆర్ విమర్శించారు. దేశ ప్రజలకు అత్యవసరమైన పెట్రో ధరలను తగ్గించే విషయంలో సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజలకు ఊరటనిచ్చె నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ హితపు పలికారు. ఇంతేకాదు పన్నులు,సెస్సులను పెంచి దేశ ప్రజలపైన విపరీతమైన పెట్రో భారం మోపిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పటికైనా ఆ నెపాన్ని రాష్ట్రాలపైకి అన్యాయంగా నెట్టడాన్ని ఆపాలని సూచించారు. కార్పోరేట్ కంపెనీల కోసం, బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయడం అలవాటుగా మార్చుకున్న మోదీ సర్కార్ దేశ ప్రజల కష్టాలు, ప్రయోజనాలను పట్టించుకుంటుందన్న నమ్మకం దేశ ప్రజలతో పాటు తనకు లేదన్నారు కేటీఆర్.