హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవటం కాంగ్రెస్ పార్టీ చేతగానితనానికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. దాన్నీ గొప్పగా చెప్పుకోవటం సిగ్గుచేటు అని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్పై మండిపడ్డారు. ఆ వైఫల్యాలను చూసేందుకు కర్ణాటక దాకా వెళ్లాల్సిన అవసరం లేదని, దగాపడ్డ కన్నడ రైతులే ఇక్కడికి వచ్చి వివరిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ కూడా అంధకారం అవుతుందని ప్రజలకు అర్థమైపోయిందని స్పష్టం చేశారు.
ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా, తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా? అని డీకేను ప్రశ్నించారు. గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయిందని, కర్ణాటక చీకటిరాజ్యంగా మారిపోయిందని తెలిపారు. అన్నభాగ్య సీమ్ అటకెకిందని, రేషన్ బియ్యం కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ తప్పిదాలకు అకడి ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడిపోతున్నారని వెల్లడించారు. రేషన్పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న తమ సంకల్పానికి, కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని కాంగ్రెస్ అసమర్థ పాలనకు తేడాను తెలంగాణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకుంటుందని తెలిపారు.
మహిళలకు ఉచిత ప్రయాణం అని మభ్యపెట్టి మొత్తానికే కర్ణాటక ఆర్టీసీని దివాలా తీసిన విధానం ప్రజలకే కాదు, అకడి ఉద్యోగులకూ పెను ప్రమాదంగా మారిందని గుర్తు చేశారు. సబ్స్టేషన్ల వద్ద మొసళ్లతో నిరసనలు, కరెంట్ కోసం పురుగుల మందు తాగి రైతుల ఆత్మహత్య ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ ఘోర పరిపాలన వైఫల్యాలకు సజీవ సాక్ష్యాలని వివరించారు. కర్ణాటకలో కమీషన్ల కుంభమేళాకు తెరతీసిన కాంగ్రెస్ అవినీతి బాగోతాన్ని చూసి తెలంగాణ సమాజం మండిపడుతున్నదని అన్నారు. కాంగ్రెస్ను నమ్మి మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని, ఇది చైతన్యానికి అడ్డా అని కుండబద్ధలు కొట్టారు.