KTR | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): పదవుల కోసం కొట్లాడుకునేవాళ్లు కాకుండా ప్రజల బాగోగులను పట్టించుకునేవాళ్లే రాష్ట్ర ప్రజలకు కావాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నలుగురు లీడర్లు ఉంటే ఐదుగురు ముఖ్యమంత్రులు ఉండే పార్టీలు కాదు రాష్ర్టానికి కావాల్సిందని తేల్చిచెప్పారు. అటువంటి పార్టీలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని హెచ్చరించారు. ఆదివారం శాసనమండలిలో రాష్ట్ర అభివృద్ధిపై జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
తెలంగాణలోనే అతిపెద్ద దవాఖాన 24 అంతస్తులతో వరంగల్లో నిర్మిస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో జూనియర్ కాలేజీలు 443 ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 1775కు చేరింది. కాలేజీల్లో 3.66 లక్షల మంది పిల్లలు చదువుతున్నరు. రెసిడెన్షియల్ స్కూల్లో చదివే ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం రూ. 1.25లక్షలు ఖర్చు చేస్తున్నది. మైనారిటీ విద్యార్థులే 2,900 మంది ఒక్కొక్కరు ఓవర్సీస్ స్కాలర్షిప్స్ తీసుకొని విదేశాల్లో చదువుతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉన్నదా?
ఉద్యోగుల సంక్షేమం విషయంలో 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. మళ్లీ ఐఆర్ ప్రకటించబోతున్నాం. మా ఉద్యోగులతో మాకున్న పేగుబంధాన్ని మరింత దృఢపరుస్తాం. కాంగ్రెస్ హయాంలో వీఆర్ఏలకు కేవలం రూ. 6 వేలు ఇస్తే మేము పేస్కేల్ ఇచ్చి అక్కున చేర్చుకున్నాం. వచ్చే దసరా, దీపావళికి సింగరేణి కార్మికులకు రూ. 1000 కోట్లు ఇవ్వబోతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న ప్రముఖ ఎరువుల తయారీ సంస్థ క్రిబ్కోను పోగొట్టుకోవడం మంచిది కాదు. ధరణిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. 99 శాతం బాగుంటే కేవలం ఒకశాతం మాత్రమే అక్కడక్కడ సమస్యలున్నాయి. అంతేగానీ ఎలుకలు ఉన్నాయని ఇంటిని తగలబెట్టుకోం కదా. మీ పార్టీ ఏమో ధరణిని రద్దు చేస్తామని చెబుతున్నది. ధరణి సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్ కూడా సుముఖంగానే ఉన్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు నిబద్దతతో ఉన్నాం. నా చిన్నప్పుడు ఎర్రమంజిల్ కాలనీలో ఉండే వాళ్లం. అక్కడి నుంచి బస్సులో స్కూలుకు పోయే వాళ్లం. బస్సు ఖైరతాబాద్ రాగానే ఆగిపోయేది. జలమండలి వద్ద నీళ్ల కోసం పీజేఆర్, లేదంటే తీగల కృష్ణారెడ్డి ధర్నాలు చేసేవారు.
చెడు అలవాట్లకు బానిసైన 17 ఏళ్ల కుర్రాడు ఒక రోజు తండ్రి జేబులో డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నించాడు. తల్లి చూసి మందలించడంతో ఆమెను చంపేశాడు. అది చూసిన తండ్రి కొట్టడంతో అతడిని కూడా రోకలిబండతో మోది చంపేశాడు. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే.. తల్లిదండ్రులు లేని అనాథనని, వదిలిపెట్టాలని జడ్జిని కోరాడు. కాంగ్రెస్ నేతల తీరు ఇలా ఉంది.
9 ఏండ్లల్లో కొత్తగా ఆరు లక్షల 15వేల మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలు వచ్చాయి. కరోనా లేకపోతే ఈపాటికి 10 లక్షలు దాటిపోయేది. గడచిన రెండేండ్ల కాలంలో బెంగుళూరును దాటేసినం. నిరుడు దేశం మొత్తంలోని ఐటీ ఉద్యోగాల్లో 33 శాతం తెలంగాణ నుంచే వచ్చాయి. ఏబుల్ లీడర్షిప్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. పదవుల కోసం కొట్లాడుకునేవాళ్లు కాకుండా ప్రజల బాగోగులను పరిరక్షించేవాళ్లు కావాలి. నలుగురు లీడర్లు ఉంటే ఐదురుగు ముఖ్యమంత్రులు ఉండే పార్టీలు కాదు రాష్ర్టానికి కావాల్సింది. అటువంటి పార్టీలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎన్నికల్లో పార్టీ విధానం చెప్పుకోండి. మేం 44 శాతం వృద్ధిని సాధిస్తే మీరు 88 శాతం సాధిస్తామని చెప్పండి. మేం 24 గంటల కరెంట్ ఇస్తామంటే మీరు 25 గంటల కరెంట్ ఇస్తామని చెప్పండి. అంతేకానీ పిండం పెడ్తం.. గండం అయితం అనేవి వద్దు.