హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2022 కల్లా బుల్లెట్ ట్రెయిన్ తెస్తామని బుల్డోజర్ సంస్కృతిని ప్రవేశపెట్టిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో బుల్డోజర్ అణిచివేతకు గుర్తుగా మారిందన్నారు. న్యూజెర్సీ పరేడ్లో బుల్డోజర్ కనిపించడం ఆ ప్రాంతంలోని హిందూ, ముస్లిం వర్గాల మధ్య విభేదాలను బహిర్గతం చేసిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన కేటీఆర్.. విదేశాల్లో మన పరువు పోయేలా కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాల మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని కేటీఆర్ ఆవేదన చెందారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తూ.. ర్యాంకింగ్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంటే ప్రతిపక్షాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయడంలేదంటూ మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని పేర్కొన్నారు.