రాజన్న సిరిసిల్ల : రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రేపటి పర్యటన సందర్భంగా తెలంగాణకు రూ. 10 వేల కోట్లు తెస్తున్నావా? అని అమిత్ షాను కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ చెమట, రక్తంతో కట్టిన పన్నులతో కులుకుతూ.. ఉత్తరప్రదేశ్, గుజరాత్లకు ఖర్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొమ్ముఒకడిది.. సోకు కేంద్రానిది అంటూ కేటీఆర్ మండిపడ్డారు. దేశ మంతా ఉచిత విద్య, వైద్యం అమలు చేసే బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని, ఆ బిల్లును పార్లమెంట్లో పెట్టే దమ్ము కేంద్రానికి ఉందా..? అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినం.. కొత్తగా కడుతున్న పార్లమెంటుకు రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మోడీ పాలనలో రూపాయి పాతాళానికి పడి పోయిందని విమర్శించారు. ఆయన పాలనలో నైజీరియా కంటే అత్యధిక పేద దేశంగా ఇండియా మారిందని విమర్శించారు. దేశం అభివృద్ధి సంగతి మరిచి యువతలో మత విద్వేషాల బీజాలు నాటుతున్నాడని, టీం ఇండియా, సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసి పనిచేద్దామంటూ అందమైన మాటలు మాట్లాడుతూ.. మోసం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమైక్య వజ్రోత్సవ కార్యాక్రమాలకు పోటీగా సమావేశాలు పెట్టడం ఎందుకని..? ప్రశ్నించారు. తెలంగాణపై దండయాత్రకు వచ్చినట్లు ఇద్దరు సీఎంలు, కేంద్ర హోం మంత్రి వస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడితే హిందూ ముస్లిం, పాకిస్తాన్ తప్ప అభివృద్ధి చేసే సోయి లేదని ఎద్దేశా చేశారు. మతపిచ్చి గాళ్ల మాయలో పడితే దశాబ్ధాల పాటు తెలంగాణ వెనుకకు పోతుందని, వారి నుంచి జాగరూకతతోఉండాలని హెచ్చరించారు. విచ్ఛిన్నకర శక్తులకు తెలంగాణ గడ్డమీద స్థానం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ను జైలుకు పంపుతామంటున్నారని, తెలంగాణను అభివృద్ధి చేసినందుకా.? రైతుల, అన్ని వర్గాలకు మేలు చేసినందుకు కేసీఆర్ను జైల్లో పెట్టాలా..? అంటూ బీజేపీ నేతలపై కేటీఆర్ విరుచుకుపడ్డారు.