హైదరాబాద్ : ప్రముఖ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి కే తారకరామారావు ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు కందికొండ చికిత్స వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించి రూ. 2 లక్షల 50 వేలు అందేలా చూశారు. హాస్పిటల్ యాజమాన్యంతోనూ మాట్లాడారు. కందికొండ పాటలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చరిత్రకు అద్దం పట్టేలా ఉంటాయని, ఆయన సాహిత్య సేవ మరింత కాలం కొనసాగేలా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.