హైదరాబాద్: ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణలోనేకాదు దేశీయంగా కూడా సిమెంటుకు భారీ డిమాండ్ ఉందన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండేలకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. దేశంలోని ప్రైవేటు సిమెంటు కంపెనీలు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయని చెప్పారు. సీసీఐ కంపెనీ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అందులో పేర్కొన్నారు. కంపెనీని ప్రారంభిస్తామంటే ప్రోత్సాహకాలు, వెసులుబాటు కల్పిస్తామన్నారు. ఈవిషయమై ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని కలిసి విజ్ఞప్తి చేశామని, అటునుంది ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదని చెప్పారు.
టీఎస్ ఐపాస్ ద్వారా తాము భారీగా పెట్టుబడులు తెస్తున్నామని వెల్లడించారు. తాము ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తుంటే.. కేంద్రం మాత్రం సీసీఐ లాంటి కంపెనీలను తెరవకుండా ఉపాధి అవకాశాలను దెబ్బ కొడుతున్నదని విమర్శించారు. కేంద్రం మొండి వైఖరితో ఆదిలాబాద్ యువతకు తీరని ద్రోహం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీసీఐ తెరిస్తే ఆదిలాబాద్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కంపెనీ పునఃప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.