KTR | అగ్రరాజ్యం అమెరికాలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయగాథలను ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ వివరించారు. అమెరికా నెవాడా రాష్ట్రంలోని హెండర్సన్ జరుగుతున్న అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ASCE)- వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో కేటీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా తాగు, సాగునీటి రంగంతో పాటు పలు రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను అమెరికా ఇంజినీరింగ్ నిపుణులు, సామాజికవేత్తలు, పరిశ్రమవర్గాలకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎదుర్కొన్న కష్టాలు, పల్లం నుంచి ఎత్తుకు గోదావరి నదీ జలాలను ఎత్తిపోసేందుకు సీఎం కేసీఆరే ఇంజినీర్గా మారి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరానికి రూపకల్పన చేసిన తీరు, నాలుగేళ్లలోనే ప్రాజెక్టు పూర్తి చేసిన తీరుపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కాలువ నిర్మాణం, పంప్హౌస్లు, సర్జ్పూల్లు, ప్రాజెక్టులో వినియోగించిన స్టీల్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ప్రాజెక్టు నిర్మాణంతో దేశంలోనే వరిసాగులో రెండో స్థానానికి చేరిన తీరును వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా తాగునీటి కష్టాలను తీర్చేందుకు చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు, దాంతో వందశాతం ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నట్లు ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. పెరిగిన మత్స్య సంపద, పాల ఉత్పత్తి, ఆయిల్ పామ్ సాగు, గొల్లకురమలకు పంపిణీ చేసిన గొర్రెల పంపిణీతో మాంసం ఉత్పత్తులు ఎలా పెరిగాయో ప్రజెంటేషన్ ద్వారా ఇంజినీరింగ్ నిపుణులు, సామాజికవేత్తలు, పరిశ్రమవర్గాలకు వివరించారు.
” తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేవలం నాలుగేండ్లలో నిర్మించడమే కాదు.. భారత దేశంలో మిషన్ భగీరథ పథకం ద్వారా 100 శాతం ఇండ్లకు నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కోటి ఇండ్లకు తాగు నీరు అందించగలగడం దేశంలో ఇదే తొలిసారి. ఈ రెండు ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులను తక్కువ సమయంలోనే పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చగలిగింది. గత తొమ్మిదేండ్లలో తెలంగాణ అత్యద్భుతమైన విజయాలు సాధించింది. దేశంలోనే తలసారి ఆదాయం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు కోటి ఎకరాలకు సాగు నీరందించగులుతున్నాం. దీని వల్ల ధాన్యం ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది. 2015-16లో 3 మిలియన్ టన్నులు ఉన్న ధాన్యం ఉత్పత్తి.. 2022-23కు వచ్చేసరికి 15 మిలియన్ టన్నులకు పెరిగింది. ఫలితంగా భారత దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారిపోయింది. 2014-15 సంవత్సరంలో 24వ స్థానంలో ఉన్న తెలంగాణ 2021-22 నాటికి దేశంలో రెండో స్థానానికి చేరుకుంది. మొత్తంగా సాగు విస్తీర్ణం 2.2 రెట్లు పెరిగింది “అని కేటీఆర్ వివరించారు.
” 2014కు ముందు తెలంగాణలో ఎక్కడ చూసినా కరువు.. కాటకాలే కనిపించేవి. చెరువులు, నదులు, బావులు ఇలా ఎక్కడ చూసినా నీళ్లు లేని పరిస్థితి ఉండేది. భూగర్భ జలాలు ఎండిపోయి తాగునీటి సమస్య విపరీతంగా ఉండేది. రైతులకు ప్రభుత్వ సహకారం లేక, బోర్లు వేసినా నీళ్లు పడక, సాగు నీటి సౌకర్యాలు లేక రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. రైతుల ఆత్మహత్యలు సాధారణమైపోయాయి. దీంతో తెలంగాణ ప్రాంతంలో సామాజిక ఆర్థిక అభివృద్ధి కుంటుపడిపోయింది. వ్యవసాయం మీద ఆదారపడ్డ 55 శాతం మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక రాష్ట్రం సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని నడపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. తెలంగాణ తలరాతను మార్చేందుకు నిర్విరామంగా కృషి చేశారు. తెలంగాణ విజన్ను నిజం చేసి చూపించారు. తెలంగాణ ప్రజల తలరాతను మార్చేశారు. కేసీఆర్ ప్రణాళిక, ఆలోచన, ఆచరణ వల్లే విజన్ రియాలిటీగా మారింది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును అత్యంత తక్కువ సమయంలోనే నిర్మించగలిగాం అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైంది. దశాబ్దాలుగా తెలంగాణలో ఉన్న తాగు, సాగు నీటి సమస్యకు పరిష్కారం చూపించగలిగాం. కాళేశ్వరం ద్వారా దశాబ్దాలుగా ఉన్న నీటి సమస్యకు పరిష్కారం చూపించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చీఫ్ ఆర్కిటెక్ట్గా, ఇంజినీర్గా మారారు. భారత దేశంలోనే కాళేశ్వరం లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ మొదటిది. ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ ప్రాజెక్టు ద్వారా సముద్రమట్టానికి 90 మీటర్ల ఎత్తు నుంచి గోదావరి జలాలను 618 మీటర్ల ఎత్తుకు తరలించి తెలంగాణ వ్యాప్తంగా సాగు, తాగు నీరు అందించగలిగాం. నాలుగేండ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్మించగలిగింది. ఇందుకోసం 11 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాం” అని కేటీఆర్ వివరించారు.
డిస్కవరి ఛానెల్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై లిఫ్టింగ్ రివర్ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించిందని ఈ సందర్భంగా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ” 101 గాజా పిరమిడ్లు నిర్మించేందుకు సరిపోయేంతలా అంటే 262 మిలియన్ క్యూబిక్ మీటర్ల మట్టిని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉపయోగించాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించేందుకు ఉపయోగించిన స్టీలుతో 66 ఈఫిల్ టవర్లు నిర్మించొచ్చు. దీనికి 4.80 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ను కాళేశ్వరం నిర్మాణానికి ఉపయోగించాం. 17.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగించాం. కాళేశ్వరానికి ఉపయోగించిన కాంక్రీట్తో 53 బుర్జు ఖలీఫాలను నిర్మించొచ్చు. 310 మిలియన్ మైళ్ల విస్తీర్ణంలో మూడు బ్యారేజీలు, 20 మెగా వాటర్ పంపింగ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 951 మైళ్ల గ్రావిటీ కాలువలు, 126 మైళ్ల సొరంగాలు, 24 రిజర్వాయర్లు, ప్రపంచంలోనే అతిపెద్ద పంప్ హౌజ్ను నిర్మించాం. ఇందులో 139 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన 7 బాహుబలి మోటార్లను ఏర్పాటు చేశాం. కాళేశ్వరంలో భాగంగా భారత్లో అతిపెద్ద ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ మల్లన్నసాగర్ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాం. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండున్నర కోట్ల మందికి ఉపయోగపడుతోంది” అని కేటీఆర్ వివరించారు.
” మిషన్భగీరథ ద్వారా తెలంగాణలోని ప్రతి పల్లెకు తాగునీరు అందించగలిగాం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాలు, గ్రామాలకు 40 టీఎంసీల తాగునీటిని మిషన్ భగీరథ ద్వారా అందించగులుతున్నాం. 28 మిలియన్ల మంది దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. భారత దేశంలోనే వంద శాతం ఇండ్లకు నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఐదు తరాల వరకు నీటి ఇబ్బందులు లేకుండా చేయగలిగాం. తెలంగాణలో నీలి విప్లవం తీసుకొచ్చాం. ఫలితంగా 50 శాతం చేపల ఉత్పత్తి పెరిగింది. శ్వేత విప్లవం తీసుకొచ్చాం. ఫలితంగా 40 శాతం పాల ఉత్పత్తి పెరిగింది. పింక్ రెవల్యూషన్కు శ్రీకారం చుట్టాం. గొర్రెల పంపిణీ పథకం ద్వారా సత్ఫలితాలు సాధించాం. ఫలితంగా రాష్ట్రంలో మూడు రెట్లు గొర్రెలు పెరిగాయి. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఎల్లో రివల్యూషన్ తీసుకొచ్చాం. ఫలితంగా ఆయిల్ ఫాం సాగు 7 రెట్లు పెరిగింది” అంటూ తెలంగాణలో తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి గురించి మంత్రి కేటీఆర్ వివరించారు.