హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పందించారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పట్టుదలకు ఇది ఫలితం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు యుద్ధప్రాతిపదికన పూర్తవుతుందని ఆయన ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులను సాధించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) కేంద్ర జల్శక్తిశాఖకు సిఫారసు చేయగా, అనుమతులు ఇక లాంఛప్రాయమే కావడం విశేషం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 34వ ఈఏసీ సమావేశం నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.
ఈఏసీ సభ్యులు సందేహాలను లేవనెత్తుతూ, నివేదికలను కోరుతూ వాయిదా వేస్తూ వచ్చారు. ఒక దశలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరును సైతం తిరస్కరిస్తూ ప్రాజెక్టు ప్రతిపాదనలను పక్కనపెట్టింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ఈఏసీ కోరిన విధంగా సంబంధిత డాటాను సమర్పించింది. దీంతో ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ 27న నిర్వహించిన ఈఏసీ 48వ సమావేశంలోనే పాలమూరు ప్రాజెక్టు ప్రతిపాదనలపై సుదీర్ఘమైన చర్చ కొనసాగింది. అయిప్పటికీ ఈఏసీ సభ్యులు పలు అంశాలపై పూర్తి వివరాలను ఇవ్వాలని కోరుతూ అనుమతుల మంజూరును పెండింగ్లో పెట్టారు. దీంతో గత నెల 24న నిర్వహించిన 49వ ఈఏసీలో మరోసారి తెలంగాణ సర్కారు తరఫున తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వాదనలు వినిపించారు.
ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను బలంగా నొక్కి చెప్పారు. ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చాలని ఈఏసీకి తెలంగాణ సర్కారు గతంలో విజ్ఞప్తి చేసింది. అయితే ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అంచనాలను సమర్పించాలని ఈఏసీ గతంలో తెలంగాణకు సూచించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఇరిగేషన్ అధికారులు అందుకు సంబంధించిన నివేదికలను సైతం ఈఏసీకి అందజేశారు. వాటన్నింటిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈఏసీ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేయడం విశేషం. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ఈఏసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజినీరింగ్ అధికారులతోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు సంబురాలు చేసుకొంటున్నారు.