నీరుకుల్ల వాగులో సూతక స్నానాలకు వెళ్లి నీట మునిగిన ఐదుగురు
ఇద్దరిని కాపాడిన స్థానికులు
ఒకే కుటుంబ సంబంధీకులు ముగ్గురు మృత్యువాత
పెద్దపల్లి, ఏప్రిల్ 23, (నమస్తే తెలంగాణ)/సుల్తానాబాద్ రూరల్: నీరుకుల్ల మానేరు వాగులో ముగ్గురు జల సమాధి అయ్యారు. సూతక స్నానాలకని వెళ్లిన వారిలో ఐదుగురు నీటమునగగా, ఒకే కుటుంబ సంబంధీకులు ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐత్రాజ్పల్లిలో విషాదం నింపింది. సుల్తానాబాద్ మండలం ఐత్రాజ్పల్లి శివారులోని నీరుకుల్ల మానేరు వాగులో శుక్రవారం ముగ్గురు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐతరాజ్పల్లి గ్రామానికి చెందిన జోగుల కాంతమ్మ-రాజయ్యకు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఒకరు ఇటీవల మృతి చెందారు. ఈ క్రమంలో వారి కొడుకు జోగుల మనోజ్, రాజయ్య సోదరి పెంట విద్య, అల్లుళ్లు రాహుల్, సాయి, అన్న కొడుకులు ఆశీష్, విగ్నేశ్, మరో ఇద్దరు జోగుల శైలజ, ఆమె కుమార్తె జోగుల వైశ్నవి ఊరి శివారులోని మానేరు వాగుకు సూతక స్నానాల కోసం వెళ్లారు. స్నానాలు చేసి గట్టుపైకి వస్తుండగా అన్నకొడుకు ఆశీష్ (10) సరదాగా ఈతకొట్టేందుకు పరుగెత్తుకుంటూ వాగులోకి వెళ్లాడు. అతడు లోతుకు వెళ్లడాన్ని గమనించిన మనోజ్, రాహుల్ బయటకు తెచ్చేందుకు వెళ్లి నీళ్లలోనే చిక్కుకుపోయారు.
నీటిలో మునిగిపోతున్న ముగ్గురిని గమంనిచిన మనోజ్ సోదరి విద్య, ఆమె కుమారుడు సాయిలు వారిని కాపాడబోయి అదే ఊబిలో కూరుకు పోయారు. ‘కాపాడండి..కాపాడండి’ అంటూ బిగ్గరగా అరవడంతో సమీపంలో ఉన్న వారు అక్కడికి చేరుకొని ఇద్దరిని రక్షించారు. మనోజ్(30), జోగుల ఆశీష్(10), పెంట రాహుల్(18) నీటిలో గల్లంతయ్యారు. స్థానికులు అరగంట పాటు గాలించి మృతదేహాలను వెలికి తీశారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి డీసీపీ పులిగిల్ల రవీందర్, ఏసీపీ నిఖితా పంథ్, సీఐ ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. పోస్టు మార్టం కోసం సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఐత్రాజ్పల్లిలో విషాదం..
సూతక స్నానానికి వెళ్లి ఒకే కుటుంబ సంబంధీకులు ముగ్గురు మృత్యువాత పడడంతో ఐత్రాజ్పల్లిలో విషాదం నెలకొన్నది. ఉదయం హుషారుగా కారులో వెళ్లిన మనోజ్, ఆయన అన్నకొడుకు ఆశీష్, అక్క కొడుకు రాహుల్ నీర్జివులుగా మారడంతో కుటుంబసభ్యులు బోరుమన్నారు. దేవుడా ఎంత అన్యాయం జేత్తివి..అంటూ గుండెలవిసేలా రోదించిన తీరు గ్రామస్తులను కలిచివేసింది. సుల్తానాబాద్ దవాఖాన మార్చురీ వద్దకు తరలివచ్చిన బంధువుల రోదనలతో దవాఖాన దద్దరిల్లింది.
ఐతరాజ్పల్లి, కిష్టంపేటలో అంత్యక్రియలు..
సుల్తానాబాద్ మండలం ఐతరాజు పల్లె గ్రామానికి చెందిన జోగుల మనోజ్, జోగుల ఆశీష్, చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన పెంట రాహుల్ల మృతదేహాలకు పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం జోగుల మనోజ్, ఆశీష్ల మృతదేహాలకు ఐతరాజుపల్లిలో, పెంట రాహుల్ మృతదేహానికి కిష్టంపేట గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
దూర దేశంలో భర్త.. కొడుకు మృత్యు ఒడికి..
వేములవాడ, ఏప్రిల్ 23: అమ్మమ్మ ఇంటికి వెళ్లిన రాహుల్ (20) మానేరు వాగులో శుక్రవారం గల్లంతై మృతిచెందిన సంఘటన వేములవాడలో వారి కుటుంబంలో విషాదం నింపింది. చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన పెంట రాజు-విద్య దంపతులు పదేండ్ల కిందట వేములవాడకు వచ్చారు. సంతోష్నగర్ బీడీ కాలనీలో నివసిస్తున్నారు. రాజు ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన ఖతర్ వెళ్లి అక్కడే ఉన్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కాగా పెంట రాహుల్ వాగేశ్వరి కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతుండగా మరో కుమారుడు సాయికిరణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కుమారులతో కలిసి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం హైత్రాజ్పల్లి గ్రామానికి విద్య తల్లిగారింటికి నాలుగురోజుల క్రితం వెళ్లింది. నూతక స్నానాల కోసం మానేరు వాగుకు వెళ్లగా రాహుల్ గల్లంతై మృతిచెందాడు. కాగా భర్త దూర దేశంలో ఉండగా కొడుకు మరణించడంతో ఆ తల్లి తల్లడిల్లింది. గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు పలువురి హృదయాలను ద్రవింపజేసింది.
ఇవి కూడా చదవండి
IPL 2021: ముంబై బ్యాట్స్మెన్ను వణికిస్తున్న పంజాబ్ బౌలర్లు
వర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది టీకా వేసుకోవాలి : గవర్నర్