ఎన్నికల్లో మందు పోయను. పైసలు పంచను. తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందు ఉన్నది. నేను పని చేస్తాననుకుంటే ప్రజలే నన్ను గెలిపించుకుంటారు. ఇష్టం లేకుంటే ఇంటికి తులం బంగారం ఇచ్చినా ఓడగొడతారు. సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకొనే బాధ్యత నాది.
– మంత్రి కేటీఆర్
Minister KTR | రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): అభివృద్ధే తన కులం, సంక్షేమమే తన మతం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. కులం పేరుతో చేసే రాజకీయం కూడు పెట్దదని, మతం పేరుతో చేసే రాజకీయం మన మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. శుక్రవారం సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణమంటపంలో బీఆర్ఎస్ పట్టణశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ ప్రసంగిస్తూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రపంచం మొత్తం చూస్తుండగా రూ.50లక్షల నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన ఓటుకు నోటు దొంగ రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా? ఆయన చేతిలో రాష్ర్టాన్ని పెట్టాలా? అని ప్రశ్నించారు. గ్యారంటీ వారంటీ అంటున్న ఆయన ఎప్పుడు బయట ఉంటడో, ఎప్పుడు జైలుకు పోతడో ఆయనకే గ్యారంటీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో ఎన్నో తప్పులు చేసిందని చెప్పారు.
1968లో 378 మంది పిల్లలను కాల్చి చంపిందని, 1971లో తెలంగాణ ప్రజాసమితి ఎంపీలను బలవంతంగా కాంగ్రెస్లో చేర్చుకున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీకి 55 ఏండ్లు అధికారమిస్తే తాగు, సాగునీరు ఇచ్చేందుకు చేత కాలేదని, ప్రాజెక్టులు కట్టే తెలివి లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్పై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని యువతకు పిలుపునిచ్చారు. ఇక్కడున్న ఎంపీ ఏం చేశాడని బండి సంజయ్ని నిలదీశారు. ‘ఓ అభివృద్ధి, సంక్షేమం తెలియదు. ఓ కాలేజీ తెచ్చే ముఖం లేదు.. ఒక్క పరిశ్రమ తెచ్చే సోయిలేదు. ఆయనకు సదువు రాదు. దొంగ డిగ్రీ పెట్టుకుని ప్రజలను కులం, మతం పేరిట రెచ్చగొడుతున్నాడు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కలలో కూడా ఊహించిన అభివృద్ధి చేశా. ఎగువ, మధ్యమానేరు ప్రాజెక్టులతో మానేరు సజీవ జలధారగా మారింది. చీర్లవంచలో అతిపెద్ద అక్వాహబ్ ఏర్పాటు చేస్తున్నాం. స్థానిక యువతకే ఉపాధి కల్పిస్తాం. నాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే, రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్ల. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గర్వంగా చెప్పుకుంటా’ అని కేటీఆర్ అన్నారు. నేతన్నలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం మార్కండేయ ఆలయంలో పూజలు చేసి.. అక్కడ నూతనంగా నిర్మిస్తున్న మార్కండేయ భవ్య మందిర నిర్మాణ పనులను పరిశీలించారు.
శ్రీ మార్కండేయ ఆలయాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆలయ పనుల పురోగతిపై స్థానిక పద్మశాలి సంఘం నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఆలయానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, విద్యార్థి యువజన విభాగం నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లలో బీఆర్ఎస్ పట్టణశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. పట్టణంలోని 39 వార్డుల యువకులు భారీగా తరలి వచ్చారు. దాదాపు 4 వేల మందికి పైగా బైక్లపై, నడుచుకుంటూ 2 కిలోమీటర్ల పాటు ర్యాలీగా సమ్మేళనానికి చేరుకున్నారు. ప్లకార్డులు చేత పట్టుకుని జై తెలంగాణ, జై కేటీఆర్, ఐకాన్ కేటీఆర్, సీఎం కేటీఆర్ అంటూ దారి పొడవునా నినదించారు.