మహబూబాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ‘వన్ నేషన్ వన్ ట్యాక్స్.. వన్ నేషన్ వన్ రేషన్’ అంటూ దేశ ప్రజలకు చెప్పిన ప్రధాని మోదీ.. నేడు ‘వన్ నేషన్.. వన్ దోస్త్’గా మారారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ.. ఒకే ఒక్కడి ఆదాయాన్ని వెయ్యి రెట్లు పెంచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ప్రియమైన ప్రధాని కాదు, పిరమైన ప్రధాని అని ఎద్దేవా చేశారు.
తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రజలకు ఏమ్రాతం మేలు చేయని బీజేపీకి వచ్చే ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రూ.4 కోట్లతో నిర్మించిన సమీకృత వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ను, రూ.2.13 కోట్లతో ఏర్పాటుచేసిన యతిరాజారావు మెమోరియల్ పిల్లల పార్క్ను ప్రారంభించారు. అన్నారం రోడ్డులో ఏర్పాటుచేసిన మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై, మహిళా సంఘాలకు రూ.1,550 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘2014లో మోదీ గొప్పలు చెప్పిండు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నడు.. నల్లధనం గుంజుకొస్తానని చెప్పిండు. నల్లధనం ఏమైందని అడిగితే తెల్లముఖం వేసుకుని తప్పించుకుని తిరుగుతుండు. జన్ధన్ ఖాతాలు తెరవండి.. ధనాధన్ రూ.15 లక్షలు జమ చేస్తాననన్నాడు. ఒక్కరి ఖాతాలోనైనా జమ చేశారా?’ అని ప్రశ్నించారు.
‘మన డబ్బుల్లన్నీ ఒకే ఒక్కడి ఖాతాలోకి వెళ్లాయి. ఆయన పేరేంది?’ అని సభికులను కేటీఆర్ అడగడంతో ‘అదానీ.. అదానీ’ అంటూ మహిళలు ముక్తకంఠంతో జవాబిచ్చారు. దోస్త్కు మూటలు మోసి, అందులో నుంచి పార్టీ చందాలు తీసుకుని, ఎమ్మెల్యేలను కొని, ప్రభుత్వాలను కూల్చడం, పార్టీలను చీల్చడమే మోదీ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. విభజన చట్టం హామీ ప్రకారం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజనవర్సిటీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
దేశంలో ఉత్తమ మంత్రి ఎర్రబెల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో పల్లెలు ఇప్పుడు ఎంతో మెరుస్తున్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు. దేశంలోనే ఉత్తమ పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అని కితాబిచ్చారు. కేంద్రం ప్రకటిస్తున్న అవార్డులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు, ప్రతి గ్రామానికి అబివృద్ధి ఫలాలు అందుతున్నాయని వివరించారు. . ప్రజల కోసం ఆహార్నిలు కష్టపడుతున్న నాయకులను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులు కండ్లముందు కనిపిస్తున్నాయని, కేంద్రం చేసిన అభివృద్ధి ఎక్కడ ఉన్నదో చూపించాలని సవాల్ చేశారు.
కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్క్
పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లలో మినీ టెక్స్టైల్స్ పార్క్ను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ జీవో కాపీని సభా ప్రాంగణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు కేటీఆర్ అందజేశారు. ప్రజలకు మంచి చేసే నాయకులను ప్రజలు కాపాడుకోవాలని కోరారు. మంత్రి దయాకర్రావు ప్రజల హృదయాలు గెలిచిన నాయకుడని, ఈ సారి లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సిరిసిల్లలో తనకు వచ్చే మెజార్టీ కంటే దయాకర్రావుకు ఎక్కువ మెజార్టీ రావాలని ఆకాంక్షించారు. తొర్రూరు మున్సిపాలిటీకి మరో రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. తొర్రూరు దవాఖానను 100 పడకలకు, పాలకుర్తిలో 50 పడకలకు ఆప్గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు.
మహిళల కోసం రూ.1,550 కోట్లు
రాష్ట్రంలోని మహిళల కోసం రూ.1,550 కోట్ల రుణాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ తొర్రూరులో ప్రారంభించారు. ఇందులో వడ్డీ లేని రుణాలు రూ.750 కోట్లు, అభయహస్తం సొమ్ములు రూ.595.43 కోట్లు, స్త్రీనిధి రుణాలు రూ.50.69 కోట్లు, పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన బ్యాంక్ లింకేజీ రుణాలు రూ.204 కోట్లు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన చెక్కులను మంత్రి కేటీఆర్ మహిళలకు అందజేశారు. వీటితోపాటు సభా ప్రాంగణంలోనే మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలో కుట్టు మిషన్లను 1,000 మంది మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, శంకర్నాయక్, ఆరూరి రమేశ్, ధర్మారెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ధరలపై కేంద్రం నియంత్రణ ఏదీ?
‘2014లో రూ.400 ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు రూ.1,200 అయ్యిందని, రూ.75 ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు రూ.110కి చేరిందని కేటీఆర్ విమర్శించారు. ప్రజలపై భారాలు మోపుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన సాగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరలు నియంత్రించలేని బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రైతులకు పంట పెట్టుబడి కోసం ఇప్పటివరకు రూ.65 వేల కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రైతుబంధు డబ్బులు వచ్చిన వాళ్లు చేతులు ఎత్తండని మంత్రి కేటీఆర్ కోరగా సభలో ఉన్న మహిళలంతా చేతులు ఎత్తడం విశేషం.
తెలంగాణలోనే వినూత్న పథకాలు
తెలంగాణలో మహిళా సంక్షేమానికి చేపడుతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు. నాడు ఎన్టీఆర్ డ్వాక్రా గ్రూపులను పెట్టి మహిళల్లో చైతన్యం తీసుకురాగా, నేడు సీఎం కేసీఆర్ స్వయం సహాయక సంఘాలకు భారీగా నిధులు ఇస్తూ.. సమాజంలో అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. గతంలో డబ్బులు కావాలంటే భార్యలు భర్తలను బతిమిలాడుకునేవారు. ఇప్పుడు భర్తలే భార్యలను బతిమిలాడుకునే పరిస్థితులు తీసుకొచ్చారు.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పురిటిబిడ్డ నుంచి ఆడబిడ్డ పెండ్లి దాకా సాయం
మహిళ గర్భం దాల్చిన ఆరు నెలల నుంచి మూడు నెలల బాలింత వరకు, పురిటి బిడ్డ నుంచి ఆడబిడ్డ పెండ్లి దాకా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తూ.. ఆర్థికంగా అండగా నిలుస్తున్నది. మహిళా దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ మహిళలకు వడ్డీలేని రుణాలను పాలకుర్తి నుంచే అమలు చేయడం ఇక్కడి మహిళల అదృష్టం. ఎన్టీఆర్ నాడు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే.. నేడు సీఎం కేసీఆర్ మంత్రిగా అవకాశం ఇచ్చి ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించారు.
– మంత్రి సత్యవతి రాథోడ్