రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వంద స్థానాల్లో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. 60 లక్షల మంది కార్యకర్తల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని చెప్పారు. కాంగ్రెస్సోళ్లు కాళ్లావేళ్లా పడ్డా, మోదీ వచ్చి గల్లీ గల్లీ తిరిగి, ఇల్లిల్లూ ప్రచారం చేసినా పేదల గుండెల్లో గూడుకట్టుకున్న కేసీఆర్ను ఓడించే దమ్ము ఎవరికీ లేదని స్పష్టంచేశారు. బుధవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో రూ.69.50 కోట్లతో నిర్మించిన వ్యవసాయ కళాశాల భవనాల సముదాయాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
సాయంత్రం ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో దండుగ అన్న వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు. ‘తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులతో పెరిగిన వ్యవసాయ విస్తరణం మన కండ్ల ముందే కనిపిస్తున్నది. ప్రతిపక్షాల నాయకులు కండ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో కొత్తగా నిర్మించిన రిజార్వయర్ల ద్వారా భూగర్భ జలమట్టం పెరిగి వాటి కింద లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది వాస్తవం కాదా? కండ్లు పెద్దవి చేసుకుని చూడండి’ అంటూ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను హెలికాప్టర్లో వస్తున్నపుడు వరుసగా ఉన్న ప్రాజెక్టులన్నీ నీళ్లతో కళకళలాడుతుంటే సంతోషం వేసిందని చెప్పారు. తెలంగాణ వ్యవసాయం దేశానికే దశ, దిశ చూపుతున్నదని వివరించారు. ఆధునిక హంగులతో నిర్మించిన వ్యవసాయ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులంతా దేశానికే దిశానిర్దేశం చేసే శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
వ్యవసాయ కళాశాలను ప్రారంభిస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి. చిత్రంలో ఎమ్మేల్యేలు రసమయి, చెన్నమనేని, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి
ప్రతిపక్షాలకు డిపాజిట్ దక్కదు: స్పీకర్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా దక్కదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు ఏమీ దొరకనందున కేసీఆర్, కేటీఆర్ కుటుంబంపై అసూయ, ఈర్ష్యతో విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను తాము పాలిస్తున్న రాష్ర్టాల్లో చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ, కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. 47 ఏండ్లలో చేసిన అభివృద్ధి కంటే మిన్నగా ఎనిమిదేండ్లలో మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేసిన అభివృద్ధిని పోచారం కొనియాడారు. కళాశాలలు, నేతన్నలు, రైతులు, బీడీ కార్మికులు, ఇలా ప్రతి రంగంలో అభివృద్ధి చేసి చూపించిన మంత్రి కేటీఆర్ను ఏకగ్రీవంగా గెలిపించుకోవాలని కోరారు. డైనమిక్ యువనేతగా ప్రపంచ గుర్తింపు పొందిన కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉండడం సిరిసిల్ల ప్రజల అదృష్టమని ప్రశంసించారు.
రైతుల కోసం 4.50 లక్షల కోట్లు ఖర్చు చేశాం: మంత్రి నిరంజన్రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రైతుల కోసం రూ.4.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని మంత్రి నిరంజన్రెడ్డి వివరించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ వినూత్న నిర్ణయాలతో నూతన విప్లవాన్ని తెచ్చిందని పేర్కొన్నారు. యాసంగిలో దేశంలో మొత్తం 95 లక్షల వరిసాగు కాగా, ఒక్క తెలంగాణలోనే 56 లక్షల ఎకరాలకు పైగా వరి సాగవుతున్నదని చెప్పారు. సమైక్య పాలనలో ఛిద్రమైన జీవితాలకు నెలవుగా మారిన సిరిసిల్ల మంత్రి కేటీఆర్ నాయకత్వంలో బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకున్నదని ప్రశంసించారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, టీఎస్టీపీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, వైస్చాన్సలర్ రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు.
మోదీ పిరమైన ప్రధాని.. బీఆర్ఎస్ సమ్మేళనంలో కేటీఆర్
‘మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం తప్ప.. తొమ్మిదేండ్లలో దేశం కోసం ప్రధానమంత్రిగా మోదీ చేసిన మంచి పని ఏదో చెప్పే దమ్ముందా? అదే కేసీఆర్ను ఏమేం చేశారని అడిగితే గంటసేపు చెప్పే దమ్ము ఈ వేదికపైన కూర్చున్న ప్రతి ఒక్కరికీ, ప్రతి కార్యకర్తకూ ఉన్నది’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతికి సంబంధించి తాము అడిగిన 17 ప్రశ్నల్లో ఏ ఒక్క ప్రశ్నకూ ప్రధాని మోదీ సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.24 లక్షల నుంచి రూ.3.17 లక్షలకు పెరిగిందని, దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇంత పెరిగిందా? అని ప్రశ్నించారు. పేదవాడి మొహంలో చిరునవ్వు కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. బంగారమంటి వినోద్కుమార్ను ఓడగొట్టి పిచ్చోడిని ఎంపీగా గెలిపిస్తే, కరీంనగర్ పరువు తీస్తున్నడని బండి సంజయ్పై మండిపడ్డారు. ‘నేను ముఖ్యమంత్రి కొడుకును కావచ్చు. కానీ, మీరు నాకు బువ్వ పెట్టి, ఆశీర్వదించి నన్ను సిరిసిల్లలో ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే హైదరాబాద్లో, అమెరికాలో విలువ వచ్చింది’ అని చెప్పారు. ‘నాకు రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్ల. ఈ గడ్డకు ఎంత సేవ చేసినా తక్కువే. మీ రుణం తీర్చుకోలేను’ అని కేటీఆర్ పేర్కొన్నారు.