Telangana | సంక్షేమానికి కొత్త అర్థాన్నిస్తూ కీలక పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. మానవీయ కోణంలో మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ఆరుగంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం.. సబ్బండ వర్ణాలపై తన ప్రేమను, బాధ్యతను చాటుకున్నది. నిజాంకాలంలో ప్రారంభమై వందేండ్లు పూర్తిచేసుకుంటున్న ఆర్టీసీకి శతవసంతాల వేళ తీపికబురు అందించింది. సంస్థను పటిష్ఠం చేసి, మరో వందేండ్లపాటు నడిపించేలా ఆర్టీసీని ప్రభుత్వంలో అంతర్భాగం చేయాలని నిర్ణయించింది. 43 వేల పైచిలుకు కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతూ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది.
ఈ నిర్ణయం అమలైన వెంటనే ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. పింఛన్లకు సంబంధించి మరో ఉదార నిర్ణయాన్ని కేసీఆర్ క్యాబినెట్ తీసుకున్నది. బీడీ కార్మికులకు ఇచ్చినట్టుగానే రాష్ట్రంలోని 6 వేలమంది టేకేదార్లకు కూడా రూ.2,016 చొప్పున పింఛన్ అందించాలని నిశ్చయించింది. దేశంలో ఎక్కడాలేనివిధంగా అనాథ పిల్లల కోసం ప్రత్యేకంగా పాలసీని రూపొందించాలని నిర్ణయించింది. అనాథ పిల్లలందరినీ ‘చిల్డ్రన్ ఆఫ్ స్టేట్’ గా గుర్తిస్తూ తీర్మానించింది. బడుగు వర్గాలకు చెందిన ఇద్దరిని శాసనమండలికి పంపాలని నిర్ణయించింది. ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్రా సత్యనారాయణ, బీసీల గొంతుక దాసోజు శ్రవణ్ను గవర్నర్ కోటాలో పెద్దలసభకు నామినేట్ చేయనున్నారు. వరద నష్టంపై విస్తృతంగా చర్చించిన క్యాబినెట్.. వర్ష బాధిత ప్రాంతాలకు రూ.500 కోట్లు తక్షణ సాయంగా ప్రకటించింది. వర్షాల కారణంగా మరణించిన వారికి నివాళులర్పించిన మంత్రివర్గం.. పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో సహాయ చర్యల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులను, ఉద్యోగులను అభినందించింది.
హైదరాబాద్ మెట్రో విస్తరణకు రూ.69,100 కోట్లతో భారీ ప్రణాళికను రాష్ట్ర మంత్రివర్గం ప్రకటించింది. దేశంలో తొలిసారి డబుల్ డెక్కర్ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించింది. మరో వందేండ్లల్లో నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుని మెట్రోను ఔటర్ అవతలివైపు వరకూ విస్తరించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): సంక్షేమ పాలనలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తమది మానవీయ పాలన అని మరోసారి చాటుకున్నది. సబ్బండ వర్గాలపై తన ప్రేమను, బాధ్యతను చాటుకుంటూ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ క్యాబినెట్ అత్యంత కీలక నిర్ణయం తీసుకొన్నది. సోమవారం హైదరాబాద్లోని అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.
మంత్రివర్గ సమావేశానంతరం క్యాబినెట్ నిర్ణయాలను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు మరికొంతమంది మంత్రులతో కలిసి మీడియాకు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో తక్షణ వరదసాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణకు గుండెకాయగా నిలుస్తున్న హైదరాబాద్లో మూడు, నాలుగేండ్లలో రూ.60 వేల కోట్లతో మెట్రోను మరింత విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈసారి కొన్ని మార్గాల్లో డబుల్ డెక్కర్ మెట్రోను తీసుకువాలని క్యాబినెట్ నిర్ణయించిందని వివరించారు. మంత్రివర్గ సమావేశ నిర్ణయాలు మంత్రి కేటీఆర్ మాటల్లోనే. జూలై 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు చాలా పెద్దఎత్తున వర్షాలు కురిశాయి. వాటివల్ల రాష్ట్రంలోని జనజీవనం అస్తవ్యస్తమైంది. అనూహ్యరీతిలో అతిభారీ వర్షాలతో వచ్చిన వరదలు, వాటివల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని, సమగ్ర నివేదికలు అందించాలని అన్నిశాఖల అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సుమారు 10 జిల్లాల్లో వర్షాలతో జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణసాయం కింద రూ.500 కోట్లు మంజూరు చేయాలని ఆర్థికశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్అండ్బీ, పంచాయతీ రోడ్లు, దెబ్బతిన్న చెరువులు, కాల్వలు అన్నింటికీ యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాలని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేయాలని, తర్వాత మరింత పటిష్ఠంగా పునరుద్ధరించాలని సూచించారు. సుమారు 27 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. అందరికీ పునరావాసం కల్పిస్తాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు చెందిన హెల్పర్, లైన్మెన్తోపాటు ఆశ్రమ పాఠశాలలో 40 మంది పిల్లలను కాపాడిన మీనయ్య సేవలను సీఎం కేసీఆర్ స్వయంగా అభినందించారు.
ఆ ముగ్గరికీ ఆగస్టు 15న ప్రభుత్వ సత్కారం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఖమ్మం పట్టణం మున్నేరు నది మీద ఆర్సీసీ వాల్తో కూడిన ఫ్లడ్ బ్యాంక్ను నిర్మించాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి నివేదిక తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. రుతుపవనాలు ఆలస్యం కావటంతో పంటల సాగు ఆలస్యమైంది. చాలాచోట్ల పంటలు వేయలేదు. ప్రస్తుతం కురిసిన వర్షాలతో చెరువులన్నీ నిండాయి. విత్తనాలు, ఎరువులు అన్నీ రైతులకు అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. భారీ వర్షాలతో సుమారు 40 మందికిపైగా మృతిచెందారు. అందరి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించాం. అందరికీ ఎక్స్గ్రేషియా అందిస్తాం. వరదలతో కొన్ని చోట్ల పొలాల్లో ఇసుక మేటలు వచ్చాయి. అన్నింటినీ పరిశీలించి వెంటనే ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించాలని సీఎస్ ద్వారా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం.
ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ ఇక అంతర్భాగం
టీఎస్ఆర్టీసీని కాపాడుకోవాలని, ప్రజా రవాణాను విస్తృత పరిచి మరింత పటిష్ఠం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ చాలా కీలకమైన నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. కార్మికుల కోరికను మన్నిస్తూ.. అదో సామాజిక బాధ్యతగా ప్రజా రవాణాను గుర్తిస్తూ టీఎస్ఆర్టీసీని మరింత పటిష్ఠం చేయడానికి అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది. సబ్ కమిటీ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఆర్అండ్బీ, రవాణాశాఖ కార్యదర్శులు, జీఏడీ, లేబర్తోపాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అందరూ సభ్యులుగా కమిటీ పనిచేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను సత్వరమే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ నెల 3న ప్రారంభం కానున్న శాసనసభలోనే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లును ప్రవేశపెడతాం. వెంటనే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కొత్తగా డబుల్ డెక్కర్ మెట్రో
తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ. అనతికాలంలోనే దేశంలోనే అద్భుతమైన నగరంగా ఎదిగింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరంగా హైదరాబాద్ దేశంలోనే అగ్రభాగాన ఉన్నది. విస్తరిస్తున్న నగరానికి మౌలిక వసతులు అంతేస్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ప్రజా రవాణాను మరింత విస్తృతం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్ ఎంత పెరిగినా, ఎన్ని లక్షల మంది వచ్చినా, ఎన్ని పరిశ్రమలు వచ్చినా తట్టుకునేలా అన్ని హంగులతో కూడిన మహా విశ్వనగరంగా ఎదిగేలా హైదరాబాద్ను తీర్చిదిద్దాలని నిర్ణయించాం. రాబోయే మూడు, నాలుగు ఏండ్లలోనే నిర్దేశిత ప్రతిపాదనలతో చాలా పెద్దఎత్తున మెట్రో రైలును విస్తరింపజేయాలని నిర్ణయించాం. దీనికి పురపాలక శాఖ మంత్రిగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర విస్తరించనున్న మెట్రోకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
టెండర్ ప్రక్రియ కూడా తుదిదశకు చేరుకున్నది.హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న 70 కిలోమీటర్ల మెట్రోకి అదనంగా 31 కిలోమీటర్లు ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ రూపంలో అందుబాటులోకి రాబోతున్నది. దీనితోపాటు జూబ్లీ బస్టాండ్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ మెట్రో (ఒక లెవల్లో వాహనాలు, మరో లెవల్లో మెట్రో) ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్యాట్నీ నుంచి కండ్లకోయ ఓఆర్ఆర్ వరకు మరో రూట్లో (ఆదిలాబాద్ -నాగపూర్ రూట్లో) డబుల్ డెక్కర్ ైప్లెఓవర్ నిర్మించాలని నిర్ణయించాం. దీనికి సంబందించి రక్షణశాఖకు సంబంధించిన కంటోన్మెంట్ భూములు కొన్ని ఉన్నాయి. హైదరాబాద్లో అతిముఖ్యమైన మరో మార్గం ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు, మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకు, విజయవాడ దారిలో ఎల్బీనగర్ నుంచి పెద్దఅంబర్పేట వరకు, వరంగల్ రూట్లో ఉప్పల్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వరకు మెట్రోను విస్తరింపజేయాలని నిర్ణయించాం.
మహబూబ్నగర్ రూట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్వైపు ఎలాగూ మెట్రో నిర్మిస్తున్నాం. భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్నగర్ వరకు, తార్నాక నుంచి ఈసీఐఎల్ క్రాస్రోడ్ వరకు మెట్రోను విస్తరిస్తాం. పాతబస్తీ మెట్రోను కూడా సమగ్రంగా విస్తరిస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పారు. ఓఆర్ఆర్ ఉన్న 159 కిలోమీటర్లు చుట్టూ మెట్రోను విస్తరించబోతున్నాం. ఎయిర్పోర్టు నుంచి ఫార్మాసిటీ అందుబాటులోకి రాబోతున్న కందుకూరు వరకు మెట్రోను విస్తరిస్తాం. మొత్తం రూ.60 వేల కోట్లతో మెట్రోను విస్తరిస్తాం. సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని మెట్రోరైల్ అథారిటీ, మున్సిపల్ శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ ఉజ్వల భవిష్యత్తును, ఎదుగుదలను దృష్టిలో పెట్టుకని ఇంకా ఏమైనా రూట్లు కలపాల్సి ఉన్నా కలుపుతాం. హైదరాబాద్లో ప్రజారవాణాను దేశంలోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దాలనే సీఎం కేసీఆర్ సంకల్పం ప్రకారం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టేందుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ఇతర పట్టణాలకు ఇచ్చినట్టే మన మెట్రోకూ కేంద్రం సహాయం అందిస్తుందని ఆశిస్తున్నాం.
హైబ్రిడ్ పద్ధతిలో టిమ్స్ నిర్వహణ
హైదరాబాద్ చుట్టూ నిర్మించతలపెట్టిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కు సంబంధించి వైద్యారోగ్యశాఖ చేసిన ప్రతిపాదనలను ఆమోదించాం. గడ్డిఅన్నారం, సనత్నగర్, గచ్చిబౌలి, అల్వాల్లో నాలుగు చోట్ల టిమ్స్ ఏర్పాటు చేయనున్నాం. వాటన్నింటినీ 50 శాతం ఉస్మానియా, గాంధీ తరహాలో, మిగిలిన 50 శాతం నిమ్స్ తరహాలో నిర్వహించాలని వైద్యశాఖను ఆదేశించాం. నిమ్స్లో మరో 2 వేల పడకల ఏర్పాటుకు సంబంధించిన నిధుల సమీకరణకు దాదాపు రూ.1,800 కోట్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్కు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 253 ఎకరాల భూములు ఇవ్వటానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జీఎమ్మార్ ఎయిర్పోర్ట్కు 120 కిలోమీటర్ల పరిధిలోనే వరంగల్ ఎయిర్పోర్ట్ ఉన్నది. దాన్ని కూడా స్లీపర్ తరహాలోనే నడపాలని కోరుతున్నాం.
మరో 8 మెడికల్ కాలేజీలు
దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా క్యాబినెట్ సమావేశంలో ఈ రోజు మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చర్చించాం. అందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మొత్తంగా పూర్తి స్థాయిగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు కానున్నది. దేశంలోనే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలవనున్నది.
వరదల్లో మృతి చెందినవారికి నివాళి
ఖమ్మం జిల్లా, పూర్వ వరంగల్ జిల్లా భూపాలపల్లిలో సంభవించిన వరదల వల్ల మరణించిన వారందరికీ క్యాబినెట్ నివాళి అర్పించింది. సంతాపాన్ని ప్రకటించింది. నష్ట పరిహారాన్ని వెంటనే అందించాలని నిర్ణయించింది. అకాల వర్షాలు, వరదలతో చనిపోయిన వారికి రైతుబీమా ఉంటే రూ.5 లక్షల పరిహారం అందుతుంది. దీంతో పాటు ఇప్పటికే మా మంత్రులు డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా వెంటనే పరిహారం అందజేస్తాం. మంత్రులు సత్యవతి, ఇంద్రకరణ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, అజయ్కుమార్తోపాటు తదితర మంత్రులు, శాసన సభ్యులు, అధికారులందరూ వరద సహాయక చర్యల్లో నిమగ్నమై సేవలు అందించారు. వారిని క్యాబినెట్ అభినందించింది. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు రానున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ద్వారా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. తాగునీటికి అడ్డంకి లేకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని మంత్రివర్గం దిశానిర్దేశం చేసింది. తాగునీటి కాలుష్యం లేకుండా క్లోరినేషన్ తదితర జాగ్రత్తలు తీసుకోవాలని పురపాలక, పంచాయతీరాజ్ శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
క్యాబినెట్ ఇతర నిర్ణయాలు
క్యాబినెట్లో దాదాపు 55 అంశాలపై చర్చలు జరిగాయి. అందులో ప్రధానమైనవి.. మహబూబూబాద్ జిల్లా కేంద్రంలో హార్టికల్చర్ కాలేజీ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మానవీయ కోణంలో రాష్ట్రంలో పనిచేస్తున్న బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నాం. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. తాజాగా బీడీ కార్మికులతో పాటు 6 వేలమందికిపైగా ఉన్న టేకేదార్లకు కూడా పెన్షన్ ఇవ్వాలని కార్మికశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, ఒంటరి తదితర కాపు అనుంబంధ కులాల పేరుతో ఉన్న సౌంతిండియా సెంటర్ ఫర్ కాపు సమితి విజ్ఞప్తి మేరకు భవన నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కమ్యూనిటీ ఏర్పాటును ఆమోదించింది. మరికొన్ని సాధారణ అంశాలపై కూడా క్యాబినెట్లో చర్చలు జరిగాయి. వరంగల్, హైదరాబాద్ ఎదుగుదల అంశాలపై కూలంకషంగా చర్చించాం’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, గంగుల కమలాకర్, చామకూర మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, వీ శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ కోటాలో శాసన మండలికి ఇద్దరు ఎంపిక
గవర్నర్ కోటాలో ఇద్దరిని శాసనమండలి సభ్యుల పేర్లను క్యాబినెట్ ఖరారు చేసింది. షెడ్యూల్డ్ ట్రైబ్స్లో ఉండే ఎరుకల సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిథ్యం లేదు. దీంతో ఎస్టీల్లో కూడా అల్ప సంఖ్యాకులుగా ఉన్న ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించిన, మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బలహీనవర్గాల గొంతుక డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్కు శాసనమండలి సభ్యులుగా అవకాశం కల్పించాం. క్యాబినెట్ ఈ మేరకు తీర్మానం చేసింది. గవర్నర్కు వెంటనే ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. తమ పార్టీ తరఫున గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు ప్రకటించిన ఇద్దరు కూడా సమాజానికి విశేష సేవలు అందించారు. అందులో ఒకరు ప్రొఫెసర్ కాగా మరొకరు మాజీ ఎమ్మెల్యే. అంతేకాకుండా ఇద్దరు కూడా అత్యంత వెనకబడిన షెడ్యూల్డ్ తెగల కులాలకు చెందినవారు. కాబట్టి వారికి తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇద్దరిని గవర్నర్ ఆమోదిస్తారని భావిస్తున్నాం.
చిల్డ్రన్ ఆఫ్ స్టేట్గా అనాథలకు గుర్తింపు
దేశంలో ఎక్కడాలేనివిధంగా మానవీయకోణంలో రాష్ట్ర క్యాబినెట్ మరోఉదారమైన నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని అనాథలందరినీ చిల్డ్రన్స్ ఆఫ్ స్టేట్గా గుర్తించాలని నిర్ణయించింది. అనాథల పాలసీని కూడా పకడ్బందీగా రూపొందించాలని శిశుసంక్షేమశాఖకు సీఎం కేసీఆర్, క్యాబినెట్ తగిన సూచనలు చేసింది. మానవీయకోణంలో పేదల కోసం ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, అనేక పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం అనాథలను గుర్తించాలని గొప్ప ఆలోచన చేసింది. ప్రభుత్వమే తల్లి, తండ్రిగా ఉండి, వారిని మన పిల్లలుగా భావించి, వారు ఎదిగి, వారికంటూ ఒక కుటుంబం ఏర్పడాలన్న ఉదాత్తమైన ఆలోచనలతో నిర్ణయాలను తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు చేయగా, వాటిని మరింత మెరుగైన ఆలోచనలు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. తదుపరి క్యాబినెట్ సమావేశానికి అందులో పొందుపరచాలని ఆదేశించారు. ఈ విషయంలో విస్తృత చర్చలు కొనసాగాయి.
హకీంపేట డిఫెన్స్ ఎయిర్పోర్ట్లో పౌరవిమానయాన సేవలు!
క్యాబినెట్ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నాం. శంషాబాద్ విమానాశ్రయం దాదాపు 2.5 కోట్ల మందికి సేవలు అందిస్తున్నది. హైదరాబాద్కు దక్షిణ భాగాన శంషాబాద్ ఉన్నది. పెరుగుతున్న నగర విస్తీర్ణం దృష్ట్యా హైదరాబాద్కు ఉన్న అనుకూలత ఏంటంటే.. మనకు డిఫెన్స్ ఎయిర్పోర్ట్స్ హకీంపేట, దుండిగల్ రెండు ఉన్నాయి. పుణె, గోవా రక్షణశాఖ విమానాశ్రయాలను పౌరవిమానాయాన సేవలకు వినియోగించినట్టే హకీంపేట ఎయిర్పోర్ట్ను కూడా వినియోగించాలని కోరుతున్నాం. డార్జిలింగ్లో నేవీ ఎయిర్పోర్ట్. ఒక రన్వే మీద, కొన్ని గంటలు వాళ్లు, కొన్ని గంటలు వీళ్లు వాడుకుంటారు. అదే రీతిలో హైదరాబాద్లో రెండో ఎయిర్పోర్ట్ను ప్రారంభించాలని, హకీంపేట విమానాశ్రయాన్ని హైబ్రిడ్ పద్ధతిలో పౌరవిమానాయన సేవలను కూడా ప్రారంభించాలని కేంద్రాన్ని కోరుతున్నాం.
కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే..బీఆర్ఎస్సే అందులో కీలకం
మా ఉద్దేశంలో ఈ కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒక్కటే. అయినప్పటికీ మా ప్రయత్నం మేం చేస్తాం. హస్తినకు వెళ్తాం.. నిధులు కోరుతాం. మెట్రో రైల్కైనా, వరద సాయమైనా ! చేస్తే మంచిది. ఇవ్వకపోతే వాళ్ల ఖర్మ. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నాం. సహకరించకపోతే 2024లో ఏర్పడేది ఎలాగూ సంకీర్ణ ప్రభుత్వమే. అందులో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుంది.
– కేటీఆర్
హైదరాబాద్లో నలుమూలలా మెట్రోరైల్
1. రాయదుర్గం- శంషాబాద్-కందుకూరు
2. శంషాబాద్ -కొత్తూర్- షాద్నగర్
3. ఇస్నాపూర్-మియాపూర్- లక్డీకాపూల్
4. ఎల్బీనగర్- పెద్ద అంబర్పేట
5. ఉప్పల్-బీబీనగర్
6. తార్నాక – ఈసీఐఎల్
7. ఓఆర్ఆర్ వెంబడి, సిటీ చుట్టూ..
డబుల్డెక్కర్ మెట్రో
ఈ కింది రూట్లలో డబుల్ డెక్కర్ ( రెండు అంతస్థుల వంతెనలు) నిర్మిస్తారు.
ఒక వంతెనను మెట్రో రైలుకు, మరో వంతెనను వాహనాలకు కేటాయిస్తారు.
1. జేబీఎస్-తూముకుంట
2. ప్యాట్నీ-కండ్లకోయ