హైదరాబాద్ : గుజరాత్లోని సబర్మతి ఆశ్రమాన్ని గురువారం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం సందర్శించారు. హైదరాబాద్ నగరం హుస్సేన్ సాగర్ తీరంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి కొప్పుల సుప్రసిద్ధ వ్యక్తుల విగ్రహాలను తయారు చేస్తున్న స్టూడియోలను పరిశీలించేందుకు ఢిల్లీ, గుజరాత్లో పర్యటిస్తున్నారు.
ఇందులో భాగంగా గుజరాత్లో సర్ధార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించేందుకు గుజరాత్కు పర్యటించారు. అలాగే జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్రోద్యమ కాలంలో సబర్మతి నదీ తీరాన ఉన్న ఆశ్రమంలో సుమారు 12 సంవత్సరాలు పాటు నివసించిన విషయం తెలిసిందే. ఆశ్రమంలో గాంధీజీ వడికిన రాట్నం, నడయాడిన ప్రాంతాన్ని కొప్పుల సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీకి నివాళులర్పించారు. ఆశ్రమ నిర్వాహకులు మంత్రికి సాదర స్వాగతం పలికి అక్కడి చరిత్ర, విశేషాలను వివరించారు.