వృద్ధుల ఫిర్యాదుల్లో 69% వారిపైనే..
సీనియర్ సిటిజన్ హెల్ప్లైన్ నివేదికలో వెల్లడి
వేధిస్తే కఠిన చర్యలు: మంత్రి కొప్పుల
వృద్ధుల కోసం వెబ్సైట్ ప్రారంభం
హైదరాబాద్, జూన్15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వయోవృద్ధులకు కొడుకులు, కోడళ్ల నుంచే వేధింపులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. వృద్ధులను వేధిస్తున్నవారిలో 56% మంది కొడుకులు, 13% మంది కోడళ్లు ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. వేధింపులకు గురవుతున్నవారిలో మహిళలు 46% మంది ఉంటే, పురుషులు 54% మంది ఉండటం గమనార్హం. వృద్ధులను కన్న కొడుకులే నిరాదరణకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. నేషనల్ హెల్ప్లైన్ ఫర్ సీనియర్ సిటిజన్స్కు ఏర్పాటుచేసిన టోల్ఫ్రీ నంబర్ 14567కు 2020 అక్టోబర్ నుంచి ఈ ఏడాది మే నెల వరకు వచ్చిన 1211 ఫోన్కాల్స్ను విశ్లేషిస్తూ తెలంగాణ రాష్ట్ర వయోవృద్ధుల సంక్షేమశాఖ ప్రత్యేక నివేదిక రూపొందించింది.
ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ నివేదికను మంత్రి కొప్పుల ఈశ్వర్ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వయోవృద్ధులను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వృద్ధుల హకుల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వృద్ధుల భద్రత, సంక్షేమం, హకుల పరిరక్షణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని పేర్కొన్నారు. వృద్ధుల సంరక్షణకు ప్రస్తుతం 2 ఆశ్రమాలు నిర్వహిస్తున్నామని, తాజాగా మరో 11 మంజూరు చేశామని వెల్లడించారు. జాతీయ వయోవృద్ధుల హెల్ప్లైన్ 14567, దివ్యాంగుల హెల్ప్లైన్ 1800-572-8980 టోల్ఫ్రీ నంబర్ల పనితీరును మంత్రి తెలుసుకొన్నారు. అనంతరం వృద్ధుల కోసం ప్రత్యేకించిన వెబ్సైట్ www// tsseniorcitizens.cgg.gov.inతో పాటు వాల్పోస్టర్ను ఆవిషరించారు.