హైదరాబాద్: బీజేపీ నాయకులు అర్థంపర్థంలేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా వాళ్లు బదులివ్వలేదన్నారు. బీజేపీ నాయకులకు క్షుద్ర రాజకీయాలు చేయడం తప్ప.. రాష్ట్ర బాగోగుల గురించి ఏ మాత్రం పట్టింపు లేదని మండిపడ్డారు. వాళ్లకు కేంద్రం నుంచి రూపాయి కూడా తెచ్చే తెలివి లేదని సోమవారం ఆయన ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.
తమకు గిట్టని, ఎదురుతిరిగిన నాయకులపై ఐటీ, ఈడీ, ఐబీ, సీబీఐలను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవడం, ప్రతిపక్షాలకు చెందిన ప్రభుత్వాలను పడగొట్టడమే బీజేపీ జాతీయ నాయకత్వం పనిగా పెట్టుకున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసి, తాజాగా గోవాలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీని నిలువునా చీల్చినది మీరు కాదా? అని బీజేపీ నేతలను కొప్పుల ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ నాయకులకు కనీసం గౌరవం లేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టడం తీవ్ర అభ్యంతరకరమని వ్యాఖ్యానించారు. మౌనదీక్ష అంటూ హడావుడి చేసిన బండి సంజయ్ పట్టుమని 10 నిమిషాలు కూడా కూర్చోలేదని, సీఎం కేసీఆర్పై నోరు పారేసుకుని ప్రజల చీదరింపులకు గురయ్యారని తెలిపారు. సంజయ్ మాటలు, చేష్టలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ప్రజలేమనుకుంటారన్న కనీస జ్ఞానం లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారన్నారు.
బీజేపీకి తెలంగాణ ప్రజల కనీస మద్దతు లేదని, గత అసెంబ్లీ ఎన్నికల్లో 107 సీట్లలో డిపాజిట్లు కోల్పోవడమే ఇందుకు ప్రబల నిదర్శనమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులు పగటి కలలు కనొద్దని, రాష్ట్రంలో ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా మీ పార్టీ అధికారంలోకి రాదన్నారు. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దేశ పరిస్థితులు, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల పట్ల లోతైన అవగాహన ఉన్న దార్శనికులు, తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్ భాషలపై మంచి పట్టున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పారు. యావత్ దేశమిప్పుడు కేసీఆర్ వైపు చూస్తున్నదని మంత్రి కొప్పుల పేర్కొన్నారు.