జగిత్యాల : తెలంగాణ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని మరే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేపట్టలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) వెల్లడించారు. మంగళవారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదెపల్లి, తీగలధర్మారం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు, ప్రజా సంక్షేమ ప్రభుత్వం సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో కొనసాగుతుందని వెల్లడించారు. రైతులకు సాగునీరు, రైతు బంధు(Raitu Bandu), రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, కల్యాణ లక్ష్మి(Kalyana Laxmi ), కేసీఆర్ కిట్, రూ. 2016 పెన్షన్, రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలకు సన్నబియ్యం తో పోషకాహార భోజనం లాంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.
నూతన వ్యవసాయ చట్టం వల్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. రైతాంగాన్ని అన్ని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకువస్తే రాష్ట్రభవిష్యత్ మారిపోతుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. నకిలీ విత్తనాలు, గుర్తింపు లేని పురుగుల మందులు విక్రయిస్తున్న వ్యాపారస్తుల పై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ బృహత్తర కార్యక్రమాలు చేపడుతుంటే వాటిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుటిల యత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.