Koppula Eshwar | హైదరాబాద్ : అన్ని వర్గాల మాదిరిగానే ట్రాన్స్జెండర్ల( Transgenders ) సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం( telangana Govt ) కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్( Minister Koppula Eshwar ) స్పష్టం చేశారు. హైదరాబాద్( Hyderabad )లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ట్రాన్స్ ఉత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటిసారిగా ట్రాన్స్ ఉత్సవం జరుపుకోవడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మన రాష్ట్రంలో సుమారు 58,918 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు తేలిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 400 మంది ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి 19 మంది సభ్యులతో రాష్ట్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. ప్రతీ జిల్లా కేంద్రంలోనూ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటుందని.. ఇందుకోసం అందరూ సహకరించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, వికలాంగుల సంస్థ ఉన్నతాధికారులు భారతి హాలికేరి, దివ్యదేవారాజన్, శైలజతో పాటు పలువురు ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు.