హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంలో దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తామని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్లోని మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈశ్వర్ పాల్గొన్నారు.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగులపై తెలంగాణ ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తుందన్నారు. రూ.3వేల పెన్షన్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రభుత్వానికి విలువైన సూచనలు చేస్తూ.. విమర్శలు మానాలని సూచించారు. ప్రజలు కోరుకునే పథకాలను అమలు చేస్తున్నారని, అయినా కొందరు తప్పుడు విమర్శలు చేస్తున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దివ్యాంగులు ప్రతిపాదించిన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు రూ.50వేలు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమశాఖ చైర్మన్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వికలాంగుల దినోత్సవం వేడుకలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించాలని వికలాంగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు మంత్రిని కోరారు. సమావేశంలో దివ్యాంగుల శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్, డైరెక్టర్ శైలజ, పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.