హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హౌస్ నుంచి దాదాపు 7 వేల మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని హజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో హజ్యాత్ర ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. హజ్ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నదని పేర్కొన్నారు. జూన్ 5 తేదీ నుంచి హజ్ చార్టర్ విమానాలు నడుపుతారని, యాత్రికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎప్పటిలాగే ఈ ఏడాది యాత్రికలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక టెర్మినల్ సౌకర్యం ఏర్పాటు చేశారని చెప్పారు. యాత్రికుల కోసం డయాస్, సిట్టింగ్ ఏర్పాట్లు, బస్ పాయింట్లు దిగడం, సామాను స్రీనింగ్, చెక్ఇన్ కౌంటర్లు మొదలైనవి హజ్హౌస్లో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసీఉల్లాఖాన్, మైనార్టీ కార్పొరేషన్ ఉన్నతాధికారి షఫీ ఉల్లాఖాన్, ఎయిర్పోర్టు, రవాణా, పోలీసులు, జీహెచ్ఎంసీ, రోడ్లు భవనాల శాఖ అధికారులు, కార్పొరేటర్ రేఖ తదితరులు పాల్గొన్నారు.