హైదరాబాద్ : భూస్వామ్య, కుల, మత వ్యవస్థలు, రాజ్యహింసకు వ్యతిరేకంగా తన జీవితమంతా పోరాడిన సామాజిక విప్లవ సేనాని మహాత్మా పూలే అని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏప్రిల్ 11.. మహాత్మా జ్యోతిరావు ఫూలే 195వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పూలేకు మంత్రి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించిన ఆయన మొదట తన భార్య సావిత్రిబాయిని విద్యావంతురాలును చేశారన్నారు. మహిళల కోసం పాఠశాలలు ప్రారంభించిన గొప్ప అభ్యుదయ బాటసారి పూలే అని కొనియాడారు.
రిజర్వేషన్ల కోసం హంటర్ కమిషన్ ఎదుట వాదించిన, కొల్హాపూర్ సాహూ మహారాజు చేత 50 శాతం రిజర్వేషన్లు పెట్టించిన ధీశాలి పూలే అన్నారు. పూలే ఆలోచనలు బాబా సాహెబ్ అంబేద్కర్కు మార్గదర్శకమవ్వడం, రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపర్చడం జరిగిందన్నారు. పూలే, అంబేద్కర్లను ఆదర్శంగా తీసుకున్న సీఎం కేసీఆర్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. అందరికి నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ మీడియంలో 970 గురుకులాల ద్వారా ఉచితంగా అందిస్తున్నారన్నారు. వీటిలో బీసీలకు 281 కేటాయించారన్నారు.
పూలే పేరిట విదేశీ విద్యా నిధి ఏర్పాటు చేసి విదేశాలలో చదువుకునే వాళ్లకు రూ. 20 లక్షల చొప్పున సాయం చేస్తున్నారన్నారు. బీసీలను ఐఎఎస్, ఐపీఎస్లుగా తీర్చిదిద్దేందుకు 11 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేశారన్నారు. బడ్జెట్లో రూ. 5,522 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కేసీఆర్ ఆపద్బంధు పథకం కింద యువతకు అంబులెన్స్ లు అందజేయనున్నట్లు వెల్లడించారు. కుల వృత్తులవారికి పనిముట్లు ఇవ్వడంతో పాటు వివిధ అంశాలలో నిపుణుల చేత శిక్షణ ఇప్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.