చౌటుప్పల్ : ఫ్లోరైడ్ రక్కసితో నడుం వంగిన నల్లగొండ వెతలు తీర్చిన నేత సీఎం కేసీఆర్ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని ఫ్లోరోసిస్ రహిత ప్రాంతంగా తీర్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ చౌటుప్పల్లోని మిషన్ భగీరథ పైలాన్ వద్ద ఫ్లోరోసిస్ బాధితులు నిర్వహించిన కృతజ్ఞత సభకు మంత్రి ఈశ్వర్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మునుగోడు గోడు విన్న నేత కేసీఆర్ అనీ, ఆయన పాలనలో ఫ్లోరోసిస్కు కాలం చెల్లిందన్నారు.
మునుగోడులో ఇంటింటికీ మిషన్ భగీరథ వచ్చిందని, కేసీఆర్ నాయకత్వమే మునుగోడుకు శ్రీరామ రక్ష అన్నారు. కేసీఆర్ వెంటే మునుగోడు జనమంతా ఉండాలన్నారు. ఫ్లోరోసిస్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని మంత్రి బీజేపీ నేతలను నిలదీశారు. దొంగ హామీలు ఇచ్చిన బీజేపీ నేతల అడ్రస్ మునుగోడులో గల్లంతు చేద్దామని పిలుపునిచ్చారు. మర్రిగూడలో 300 పడకల దవాఖాన కట్టిస్తానన్న నడ్డా.. నీ అడ్రస్ ఎక్కడ? అని ప్రశ్నించారు. దొంగ హామీలు ఇచ్చే బీజేపీ దొంగ హామీలను నమ్మొద్దని, ఆ పార్టీ నేతల అవకాశవాద రాజకీయాలు మనుగోడులో చెల్లవన్నారు. మంచినీళ్లు ఇచ్చి ఆదుకున్న కేసీఆర్ సర్కారే ముద్దని, కాషాయ పార్టీకి మునుగోడులో చోటులేదన్నారు.
మిషన్ భగీరథ బతుకులు బాగు చేసిందని, మళ్లీ బతుకులను బీజేపీకి ఓటువేసి ఆగం చేసుకోవద్దన్నారు. దివాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ ఫ్లోరోసిస్తో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆనాటి పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు. మోసపూరిత హామీలు ఇచ్చి ఫ్లోరోసిస్ బాధితులను మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం మునుగోడు ఉప ఎన్నికల్లో ఫ్లోరోసిస్ బాధితులను మళ్లీ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, నల్గొండ శ్రీను, రఘు, ఫ్లోరోసిస్ బాధితులు అంశాల స్వామి, అంజి, రాములు, మౌనిక తదితరులు పాల్గొన్నారు.