జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 9: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ముస్లింలు సురక్షితంగా ఉన్నారని, వారి అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాం గ్రెస్ పార్టీ ముస్లింల అభివృద్ధి కోసం ఎందుకు ఆలోచించలేదో చెప్పాలని కొప్పుల డిమాండ్ చేశారు. శనివారం జగిత్యాలలోని విరూపాక్షి గార్డెన్స్లో ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు కుట్టుమెషిన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేలు సంజయ్కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఓమర్ జలీల్లతో కలిసి మంత్రి ఈశ్వర్ 400 మంది మైనార్టీ మహిళలకు కుట్టుమెషిన్లు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని క్రిస్టియన్, మైనార్టీలు ఆర్థికంగా ఎదగాలని, సమాజంలో అందరూ సమానంగా ఉండాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.20 కోట్లతో 25 వేల కుట్టు మెషిన్లను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. నిరుపేద ముస్లిం యువతులకు షాదీముబారక్, విద్యార్థులకు మైనార్టీ గురుకులా లు ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో ఒకేసారి 204 గురుకుల పాఠశాలలు ప్రారంభించినట్టు చెప్పారు. ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి రూ.20 లక్షలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు.