గొల్లపల్లి, సెప్టెంబర్ 19: ‘ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చేవన్నీ ఝూటా హామీలే. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆచరణకు సాధ్యం కాని వాగ్దానాలిచ్చి మోసం చేయాలని చూస్తున్నది. దమ్ముంటే ముందుగా ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేసి చూపించాలి’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. మంగళవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో మంత్రి ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కొప్పుల మాట్లాడుతూ.. మొన్న హైదరాబాద్కు వచ్చిన కాంగ్రెస్ నాయకులు అన్నీ అబద్ధాలే మాట్లాడారని, ప్రజలను మోసం చేసేందుకు భారీ స్కెచ్ వేశారని, ఇందుకు వారిచ్చిన హామీలే నిదర్శనమని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు నాలుగున్నాయని, ఇక్కడ ప్రకటించిన హామీలను ఆయా రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ముందుగా ఆయా రాష్ర్టాల్లో అమలు చేసి చూపిస్తే.. ఇక్కడి ప్రజలు వారిని నమ్ముతారని తెలిపారు.
తెలంగాణలో కేసీఆర్ సీఎం కాకపోతే ఇంతటి అభివృద్ధి జరిగేదా? 24 గంటల ఉచిత విద్యుత్తు వచ్చేదా? ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందేదా? రైతుబంధు, రైతు బీమా ఇచ్చేవారా? ఒకసారి ఆలోచించాలని ప్రజలకు సూచించారు. తొమ్మిదేండ్లలోనే రాష్ర్టాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని కోరారు.