హైదరాబాద్ : బీజేపీ పాలనలో రైతులకు అన్యాయం జరుగుతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. జగిత్యాల జిల్లా మల్యాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా కొరండ్ల నరేందర్రెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రమాణస్వీకారం చేసిన చైర్మన్తో పాటు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే కుటుంబానికి భరోసానిచ్చేందుకు రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. అయోమయంలో ఉన్న రైతాంగానికి చేయూతనిచ్చేందుకు సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. కేంద్రం సహకరించకున్నా వడ్లను కొనుగోలు చేసేది లేదని చెప్పినప్పటికీ కేవలం రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతోనే రైతుపక్షపాతిగా సీఎం మరోసారి ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ద్వారా సుమారుగా రూ.1200కోట్ల నష్టం వస్తుందని తెలిసినా రైతుల కోసం పరితపించే సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, ఈ విషయంలోనే అర్థం అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠధామాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత తదితరులు పాల్గొన్నారు.